రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) ఆ రెండు పార్టీల ధోరణిపై మండిపడ్డారు.అటు కాంగ్రెస్,ఇటు బీజేపీలు చేసే రెండు జపాలు కూడా ప్రజల కోసం కాదని, అధికారమే పరమావధిగా పెట్టుకుని జపాలకు పూనుకున్నాయని ఎద్దేవా చేశారు.
జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలపై బీజేపీ, కాంగ్రెస్ ( BJP , Congress )ధోరణిని తీవ్రంగా దుయ్యబట్టారు.అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సావాలను రాజకీయం చేయజూస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజీనామాలు అంటేనే తోక ముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని ఘాటుగా ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా 500 మెఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో సహా ఏడు మండలలాలను ఆంధ్రలో కలిపిన బీజేపీ పార్టీకీ తెలంగాణా గురుంచి మాట్లాడే హక్కు ఏక్కడదంటూ నిలదీశారు.
ఏడు దశాబ్దాలుగా తెలంగాణను గాఢ అంధకారంలో నెట్టిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సావాల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు.తెలంగాణ గురించి రాజీనామా అంటేనే తోక ముడిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉత్సావాల గురించి మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు.
తొమ్మిదేళ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాధించుకున్నందునే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అంతటి అభివృద్ధిలో భాగస్వామ్యమైన బీఆర్ఎస్ శ్రేణులు దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయని,వరి దిగుబడిలో సాధించిన విజయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలకు తార్కాణమన్నారు.