ఎమ్మెల్యే,మంత్రిపై దాడులు జరిగితే ఇలానే చేస్తారా? అధికార పార్టీ అరాచకాలను ప్రతిఘటిస్తాం.అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులు.
సూర్యాపేట జిల్లా:అధికార పార్టీ ఎమ్మెల్యే,మంత్రిపై దాడులు జరిగితే పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ స్థానిక సిఐపై నల్లగొండ ఎంపీ,మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హుజూర్నగర్ పట్టణంలో టీఆర్ఎస్ గూండాల దాడికి గురైన జర్నలిస్టు సైదులుగౌడ్,సింగ మోహనరావులను ఆయన శుక్రవారం పరామర్శించారు.
టీఆర్ఎస్ నేతల, జిల్లా అధికార యంత్రాంగం యొక్క అవినీతి, అక్రమాలను బయటపెట్టిన వారిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ను సందర్శించి పక్షపాతంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసు అధికారులను హెచ్చరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ నేతల ఇష్టానుసారం పని చేస్తుందని మండిపడ్డారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇసుక మాఫియా,మద్యం మాఫియా,ప్రభుత్వ భూములను కబ్జా చేయడం కాకుండా,ప్రైవేట్ స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారని,ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
ఈఎస్ఐ హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో లీనా ఏజెన్సీ పేరుతో ఉద్యోగుల నుండి ఒక్కొక్కరి నుండి మూడు లక్షల వరకు వసూలు చేశారని,వసూలు చేసిన మొత్తం ఎవరి వద్ద ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు.ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగుల నియామకం టెండర్ పద్ధతిలో ఇవ్వాలి కానీ,మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి ఏజెన్సీతో చట్ట విరుద్ధంగా నామినేషన్ వేయించి జిల్లా కలెక్టర్ తప్పు చేశాడని అన్నారు.
గతంలో కూడా జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగుల నుండి డబ్బులు వసూళ్లు చేశారన్నారు.ఈఎస్ఐ హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని సొంత పార్టీ నాయకులే కోర్టుకెళ్తే అతనిపై దాడికి తెగబడిన ఎమ్మెల్యే అనుచరుల దాడి గురించి వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చిన విలేకరిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
మున్సిపాలిటీ కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసి అక్రమ భూకబ్జాలు చేస్తుంటే ఫోర్జరీ సంతకంపై కేసు పెట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని,సరైన సమయానికి సరైన గుణపాఠం చెప్పి అతి త్వరలో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయన్నారు.
ఇప్పటికైనా పోలీసులు తమ విధుల పట్ల సమర్థ వంతంగా పనిచేసి,ప్రజల్లో పోలీసులు పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రేస్ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.