సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మండలం పరిధిలోని తండాలకు ఇంకా బీటీ రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అభివృద్ధి మంత్రం జపిస్తూ మభ్యపెడుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్అన్నారు.బుధవారం కోటియా నాయక్ తండా గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన గుల్లబండ( gullabanda ) తండా గ్రామానికి వెళ్లే రహదారి వర్షాలకు బురదమయంగా మారి అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బురదలో పొర్లు దండాలు పెడుతూ,స్థానికులతో కలిసి రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామస్తులతో కలిసి బురద రోడ్డుపై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు దాటినా ఇంకా తండాలకు బీటీ రోడ్లు( BT Roads ) లేకపోవడం దారుణమని,ఎన్నోసార్లు ప్రజలు అధికారులకు,ప్రజా ప్రతినిధులకు తమ గోడు చెప్పుకున్నా ఫలితం లేదని అన్నారు.
ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వెంటనే బీటీ రోడ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ చైర్మన్ దాచేపల్లి వీరశేఖరయ్య, నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ హఫీజ్,ఎస్టీ సెల్ చైర్మన్ గుగులోతు ప్రేమప్రసాద్, గుండెపురి ఎంపిటిసి ధరావత్ జుమ్మీలాల్, స్థానిక సర్పంచ్ హైమావతి,పార్టీ నాయకులు రామోజీ, కౌన్సిలర్ భాస్కర్,గ్రామ శాఖ అధ్యక్షులు ధరావత్ నాగేందర్,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.