సూర్యాపేట జిల్లా:పింఛన్ తీసుకోవడం కోసం వృద్దులు, వికలాంగులు,మహిళలు పట్టణంలో రెండు కిలోమీటర్ల పైన నడిచి వెళ్తున్నారని,వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఓటు కోసం మీ వద్దకు వస్తే ఐదు కి.మీ.
దూరం తరిమికొట్టాలని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో వార్డువార్డులో కాంగ్రెస్ పాదయాత్రలో భాగంగా ఆయన సోమవారం 41,42 వ వార్డుల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడుగుతూ వారికి మనో ధైర్యాన్ని కల్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర ఎన్నికల కోసం కాదని,పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమని తెలిపారు.
గత ఎనిమిదేళ్లుగా సూర్యాపేట నియోజకవర్గాన్ని పాలిస్తున్న రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేసిండో చూపించాలని సవాల్ విసిరారు.ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల వార్డుల అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు.
ఈ వార్డుల్లో దసరాకు మురికి కాలువలు పండుగల సమయాన తీస్తున్నారని,దీపావళికి తీస్తే తిరిగి సంక్రాంతికి తీస్తున్నారని ఆరోపించారు.కాలువలు తీసిన చోట చెట్లు పెరిగినా పట్టించుకోవడం లేదన్నారు.పట్టణంలో తోపుడు బండి తోసుకొనిపోయి వ్యాపారం చేసుకోలేని పరిస్థితి నెలకొందని,పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు.10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో 25 వేల ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని,అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో 3 ఇందిరమ్మ కాలనీలు మంజూరు చేసి ఇండ్లు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు.మంత్రి జగదీష్ రెడ్డి హయాంలో 15 వేల మంది ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 192 ఇండ్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడని ఎద్దేవా చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, పేదప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజాపాలన అందిస్తామని తెలిపారు.
ఈ పాదయాత్రలో తనకు పట్టణ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారని,భవిష్యత్ లో ప్రజల కోసమే పని చేస్తానని భరోసా ఇచ్చారు.