నల్లగొండ జిల్లా:నన్ను నమ్మండి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని,కేసీఆర్ పై నమ్మకం లేక బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు పెద్ద సంఖ్యలో గోడ దూకడానికి రెడీగా ఉన్నారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 96 వ రోజు నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లికి చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేయడమేనని,కుర్చీ వేసుకొని అక్కడే కూర్చొని 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయిస్తానని చెప్పిన కేసీఆర్ ఏడేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
ఏడేళ్లలో పూర్తికాని ప్రాజెక్టు నాలుగైదు మాసాల్లో ఎలా పూర్తి అవుతుందని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన నిధులు కేసీఆర్ దగ్గర ఎక్కడివని,ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన సమయం ఎక్కడున్నదని,రెండు నెలల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తే నువ్వెట్లా ప్రాజెక్టును పూర్తి చేస్తావని నిలదీశారు.
ఎన్నికల కోసం మరోసారి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావని,ఇంకెంత కాలం ప్రజలను ఓట్ల పేరుతో మోసం చేస్తావంటూ కేసీఆర్ పై భట్టి ఫైరయ్యారు.
పాలమూరు రంగారెడ్డి ( Ranga Reddy )ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టులో కొంతమంది కేసులు వేశారని సీఎం కేసీఆర్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారని, ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళింది ఎవరని, ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రజలు కోర్టుకు వెళ్లారంటే నువ్వు చేస్తున్నది అన్యాయం కాబట్టి న్యాయం చేయమని వెళ్లడం తప్పు కాదు కదా అన్నారు.ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం వెళ్లేది కోర్టులకేనని,న్యాయస్థానాలు కేసీఆర్ చేసింది అన్యాయమని అనుకుంటనే పనులు ఆపమని అంటుందని, నువ్వు చేసేది న్యాయమే అయితే,కోర్టులు ఇచ్చిన తీర్పులే అన్యాయంగా ఉంటే బేషరతుగా బయటికి వచ్చి న్యాయస్థానాలు అన్యాయం చేస్తూన్నాయని ఎందుకు చెప్పటం లేదన్నారు.పాలన రాజ్యాంగం ప్రకారమే జరగాలే కానీ,నీ ఇష్టం వచ్చినట్టుగా కాదన్నారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలన్నారు.పోలీసులు నా చేతుల్లో ఉన్నారని భయపెట్టి బెదిరించి బలవంతంగా ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి భూములు గుంజుకోవడం అన్యాయం కాదా? అంటూ భట్టి ప్రశ్నించారు.నువ్వు,నీ పాలన యంత్రాంగం అన్యాయం చేస్తున్నారు కాబట్టే ప్రజలు న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నారన్నారు.
బీఆర్ఎస్( brs ) పాలనలో పేద నిర్వాసితులు బతికే హక్కు లేదా? అన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ సన్న, చిన్నకారు రైతుల గురించి రాష్ట్రంలో మాట్లాడేవారు కరువయ్యారన్నారు.
అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని పోలీసులతో బెదిరింపులు చేయిస్తూ పాలన ఇంకెంత కాలం చేస్తావన్నారు.ప్రజలు నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సిద్ధమవుతున్నారన్నారు.
నువ్వు తీసుకొచ్చిన ధరణి నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న కృష్ణా జలాల్లో నీటి వాటా ఎంత ఉందో సీఎం కేసీఆర్ ఎందుకు తేల్చడం లేదు? ఎక్కడ లాలూచీ పడుతున్నారని అన్నారు.
ప్రజల ప్రయోజనాల కంటే మీ సొంత ప్రయోజనాలను ఎందుకు చూసుకుంటున్నారని,10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం సరికాదన్నారు.కృష్ణాజలాలో తెలంగాణ వాటా ఎంతో వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డిలు 10 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్ ఎల్ బి సి టన్నెల్, నక్కలగండి,డిండి, ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదన్నారు.ఆస్తులు పోగేసుకోవడంపై ఉన్న శ్రద్ధ జిల్లా ప్రజలకు సాగునీరు అందించే విషయంలో ఎందుకు లేదన్నారు.
ప్రాజెక్టుల పేరిట ఐదు లక్షల కోట్ల అప్పు,ఈ వార్షిక సంవత్సరంలో మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కావలసిన కేవలం 222 కోట్ల రూపాయలు ఎందుకని ఇవ్వడం లేదన్నారు.మీరు ఎందుకు తీసుకురావడం లేదన్నారు.
పది సంవత్సరాలు కావస్తున్నా ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక్క రోజైనా రివ్యూ ఎందుకు చేయలేదన్నారు.నల్లగొండ జిల్లాకు కృష్ణా నది జలాలు రాకుండా అడ్డుపడుతున్నది ఎవరన్నారని,ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో లేదుగా? ఆంధ్ర పాలకులు లేరు కదా అని, మరీ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిధులు తీసుకురాకుండా ఏమైనా గాడిదలు కాస్తున్నారా? అని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లపై ద్వజమెత్తారు.కాంగ్రెస్ హయాంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులను 2014 సంవత్సరం నాటికి 80 శాతం పనులు పూర్తి చేయగా పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో 20% పనులు పూర్తికాకపోవడం సిగ్గుచేటన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎందుకు నిధులు తీసుకురాలేదని అడిగినందుకు నా పాదయాత్రకు గమ్యం, గమనం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.నా పాదయాత్రకు గమ్యం, గమనం,స్పష్టత ఉన్నదన్నారు.
నల్లగొండ జిల్లాకు కృష్ణ జలాలు రాకుండా అడ్డుకుంటున్న పాలకులను చీల్చి చెండాటమే నా పాదయాత్ర లక్ష్యమన్నారు.కడెం,ఎస్ ఆర్ ఎస్ పి,కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్టుల కెనాల్స్ మరమ్మత్తులకు, మెయింటెనెన్స్ కు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు ఆర్థిక సాయమందిస్తామన్నారు.మీడియా సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య,మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను,ఎంపీపీ శేఖర్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు దైద రవీందర్, వేదాసు శ్రీధర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.