సూర్యాపేట జిల్లా:మా భూమిని అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో నిర్మాణాలు చేస్తూ అడ్డుకున్నందుకు మాపై దౌర్జన్యం చేస్తున్నారని జిల్లా కేంద్రంలోని చింతల చెరువుకు చెందిన అన్నదమ్ములు సుంకరి అంజయ్య,జనార్ధన్, వెంకటేశ్వర్లు,లచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలో వారు తమ భూమి వద్ద మాట్లాడుతూ మా తాత సుంకరి వీరయ్యకు స్థిరాస్తి మా నాన్న సుంకరి రామనర్సయ్య ద్వారా మా ఏడుగురు కుమారులకు వచ్చిందన్నారు.
మా ఏడుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చనిపోగా మేము నలుగురం ఉన్నామని తెలిపారు.మాకు చింతల చెరువు సర్వే నెంబర్ 38/1లో 32 గుంటల భూమి ఉండగా అందులో నాలుగు గంటలు అమ్ముకున్నామని తెలిపారు.
మిగిలిన 28గుంటల భూమిని కౌల్లకు ఇచ్చుకుంటూ మేము వరంగల్,ఖమ్మం పట్టణాలకు వలస వెళ్లామన్నారు.భూమి పహాణి మా పేర ఉన్నప్పటికీ గత పదేండ్లుగా కొందరు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించారని అన్నారు.
ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని మరికొందరికి అమ్మారని వారు రాత్రికి రాత్రే అందులో నిర్మాణాలు చేస్తుండగా మేం అడ్డుకుంటే మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి తగిన విచారణ చేసి మా భూమిని మాకు అప్పగించి,న్యాయం చేయాల్సిందిగా కోరారు.