బూటక మాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్ఎస్ నేతలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

 Kcr Is Deceiving The People With Fake Words: Dr. Rs Praveen Kumar-TeluguStop.com

బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.

కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే పేద ప్రజలను మభ్యపెట్టే పథకాలు ప్రవేశపెట్టి,ఎన్నికలయ్యాక మర్చిపోతారని ఎద్దేవా చేశారు.పాలకవీడు సమీపంలో వరి రైతులతో మాట్లాడిన ఆయన రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్ల ద్వారా బేషరతుగా కొనుగోలు చేసి,కేంద్రానికి అమ్మాలని డిమాండ్ చేశారు.

యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు రోడ్లపై రాస్తారోకో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.స్థానిక రాజకీయ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

అధికారం అండతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ భూములు కబ్జా చేసి దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని,శూన్యతండా రైతుల భూమిని పెన్నా సిమెంట్,దక్కన్ సిమెంట్ కంపెనీలకు కట్టబెట్టి వారికి కనీస నష్టపరిహారం చెల్లించలేదని,సిమెంట్ పరిశ్రమల్లో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.పక్కన కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా నియోజకవర్గంలో గిరిజన తండా వాసులు మంచినీటి సౌకర్యం నోచుకోలేదని,వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో కాంట్రాక్టర్లు లాభపడ్డారే తప్ప పేదలకు మంచినీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చింతలపాలెం మండలం నెమలిపురంలో సర్వే నెంబర్ 318 లో 1398 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన దళారులపై రెవిన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాలకవీడులో గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కార్యాలయంలో గిరిజన వర్గాలకు చెందిన ఒక్క ఐఏఎస్ అధికారి లేకపోవడం గిరిజనులపై వివక్ష కాదా? అని ప్రశ్నించారు.కేసీఆర్ దోపిడీ నుండి ప్రజలను రక్షించడానికే బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.తదనంతరం యల్లపురంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ప్రజలు కేసీఆర్‌ బూటక మాటలు నమ్మకుండా బీఎస్పీని ఆదరించాలన్నారు.జాన్ పహడ్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు.

నియోజకవర్గంలో శూన్యతండా,పాలకవీడు,సోమవరంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.ఫతేపురం,పెంచికల్ దిన్నె,నేరేడుచర్ల మీదుగా యాత్ర సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube