సూర్యాపేట జిల్లా :జిల్లాలో కరువు మండలంగా పేరున్న మోతె మండలంలో యాసంగి సీజన్ అన్నదాతల గుండెల్లో దడ పుట్టిస్తోంది.గత వర్షా కాలంలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడక, నాన్ ఆయకట్టు ప్రాంతమైన మోతె మండల పరిధిలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.
అయినా వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగం బోర్లు,బావులు,చెరువుల మీద ఆధారపడి యాసంగి సీజన్లో సాగులోకి దిగారు.కానీ,వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి రోజు రోజుకు సాగునీటికి కటకట ఏర్పడింది.
ఈ ప్రాంతానికి వచ్చే ఎస్సారెస్పీ నీళ్లు కూడా సక్రమంగా రాకపోవడంతో వేసిన పంటలు చేతికి అందేనా అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కాలువల సౌకర్యం ఉన్నప్పటికీ నీటి లభ్యత లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికే యాసంగిలో వరి పంట సాగు చాలా వరకు తగ్గింది.వేసిన కొద్దిపాటి పంటలకు నీళ్లు సరిపోక పెట్టిన పెట్టుబడి మందం పంట చేతికొస్తదో రాదోనని గుబులు చెందుతున్నారు.
వేసవి ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో తాగు నీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉందని,ప్రభుత్వం చొరవ తీసుకుని ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు,బావుల ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.