సూర్యాపేట జిల్లా:ముందే హెచ్చరించిన పట్టణ ప్రజలు.పట్టించుకోని అధికార యంత్రాంగం.
మంత్రి మాట కూడా వినే పరిస్థితిలో అధికారులు లేరా?వర్షం వస్తే వణికి పోతున్న పేట ప్రజలు.యథేచ్ఛగా నాలాల కబ్జాలు,కళ్ళుండి చూడలేని అధికారులు.
అధికారుల అలసత్వమే పేటకు ముప్పుగా మారింది.ఒక్కరోజు వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయం.
మొక్కుబడి చర్యలకు ఉపక్రమించిన అధికారులు.అధికారుల తీరుపై మండిపడుతున్న మానస నగర్ వాసులు.
జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పట్టణం తడిసి ముద్దైంది.ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గతేడాది వర్షాలకు పట్టణంలోని మానస నగర్ తదితర కాలనీలు జలదిగ్భంధనంలో చిక్కుకున్న చేదు అనుభవాల నుండి అధికార యంత్రాంగం గుణపాఠాలు నేర్చుకోక పోవడంతో మళ్ళీ మానస నగర్ కు ముప్పు పొంచి ఉందని చెప్పొచ్చు.సాక్షాత్తు జిల్లా మంత్రి ఆదేశాలిచ్చినా అధికారుల్లో చలనం లేకపోవడంతో ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో నాలాల క్రమబద్దీకరణ మొదలు పెట్టకపోతే మళ్ళీ పేటకు నీటి గండం తప్పేలా లేదు.నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే మానస నగర్ ప్రాంతం మొత్తం చెరువును తలపిస్తోంది.
నాలాల ఆక్రమణలపై అధికారుల అలసత్వం వహించడంతో ఈ పరిస్థితి దాపురించిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తడిసాక మేలుకున్న అధికారులు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ పెరమాళ్ళ అన్నపూర్ణ మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.దీనితో మొద్దునిద్ర వీడిన మున్సిపల్ సిబ్బంది వర్షంలో నాలాలో ఇరుక్కున్న వాటిని తొలగిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
లోతట్టు ప్రాంతాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు ప్రారంభించారు.మున్సిపల్ సిబ్బంది నాలాలో ఇరుక్కున్న చెత్త చదారాన్ని తొలగిస్తున్నారు.
ఇదేదో ముందే జాగ్రత పడి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా అని కాలనీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాలాల కబ్జాల తొలగింపుకు రాజకీయ వత్తిళ్లే అడ్డంకిగా మారాయని,ముందుపోతే గొయ్యి వెనుకపోతే నుయ్యి అన్న చందంగా మా పరిస్థితి తయారైందని అధికారులు లోలోన మదనపడుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రి ఆదేశాలు ఇచ్చినా కిందిస్థాయి లీడర్ల వత్తిడి ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించి దగ్గరుండి నాలాల క్రమబద్దీకరణ చర్యలు చేపట్టకపోతే పేట పరిస్థితి మునుముందు ఇంకా దారుణంగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.