సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రావడంలేదని హాస్పిటల్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ 3 నెలలు అయినా జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని,స్కూల్స్, కాలేజీలు మొదలు కావడంతో,పిల్లల ఫీజులు,ఇంటి అద్దెలు నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం అందినకాడికి అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.3 నెలలు జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురి అవుతున్నామని,అడిగితే పై సిబ్బంది సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మూడు నెలలకోసారి వచ్చే జీతాలు ఇప్పటికీ అందక పోవడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైనదన్నారు.వచ్చే జీతం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతాయా అన్నట్లుగా ఉందని వాపోతున్నారు.
ఇళ్లలో పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉండటంతో ఇక భరించలేక నిరసన తెలియజేస్తున్నామని,దయచేసి తమకు జీతాలు మంజూరు చేసి కుటుంబాలను కాపాడాలని వేడుకున్నారు.