సూర్యాపేట జిల్లా:సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్లు అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావుచే స్థాపించి,రాష్ట్రంలో తొలిసారి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జీవన్ కుమార్ పిలుపునిచ్చారు.ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకారపు రమేష్ అధ్యక్షతన జరగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ గడ్డపై హైదరాబాద్ నడిబొడ్డున స్థాపించి చైతన్య రథంపై సుడిగాలి పర్యటన చేసి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చారనిఅన్నారు.
అదే స్ఫూర్తితో నేడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.అనంతరం ఆకారపు రమేష్ మాట్లాడుతూ…ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు,నిధులు, నియామకాలతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్న ప్రజల ఆశలపై కేసీఆర్ కుటుంబం నీళ్లు చల్లిందని విమర్శించారు.2014 లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం 5 లక్షల కోట్ల అప్పులోకి నెట్టారని,8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని అన్నారు.ధరణి పోర్టల్ ప్రజల పాలిట యమపాశమై పోడు భూములను రక్తసిక్తం చేసిందన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంతవరకు పేదలకు పంపిణీ చేయలేదన్నారు.నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, తెలుగుదేశం పార్టీలో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు కుందారపు కృష్ణమాచారి,రాష్ట్ర తెలుగు రైతు మాజీ అధికార ప్రతినిధి ఎండి యాసిన్,రాష్ట్ర నాయకులు పాపినేని రమేష్,మోత్కూరు మండల అధ్యక్షుడు సూదగాని పాండు, మల్లయ్య,శేఖర్, నియోజకవర్గంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.