కేసీఆర్ ను నమ్మి అధికారాన్ని అప్పగిస్తే తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్ విమర్శించారు.మార్చ్ 10న హైద్రాబాద్లో జరిగే తెలంగాణ బచావో సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో జనసమితి కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీని అయన జెండా ఊపీ ప్రారంభించారు.
అనంతరం అయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు తెలంగాణా ప్రజలు సాగించిన వీరోచిత ఉద్యమాల ఫలితంగా 2014 లో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ పోరాటంలో తెలంగాణా జేఏసీ కేంద్రంగా గ్రామగ్రామాన ఏర్పడిన తెలంగాణా జేఏసిలు ప్రజలను ఐక్యం చేశాయని,ఈ జేఏసీలే మిలియన్ మార్చ్,సకల జనుల సమ్మె,సాగరహారం, సడక్ బంద్,రైల్ రోకో లాంటి కార్యక్రమాలలో లక్షల సంఖ్యలో ప్రజలను ఉద్యమానికి కదిలించాయని గుర్తు చేశారు.వందలాది మంది విద్యార్థి,యువకుల రక్త తర్పణతో,ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణా ఇవాళ పాలకుల అప్రజాస్వామిక దృక్పథం వలన,స్వార్థం వలన సంక్షోభపు చౌరస్తాలో నిలబడిందని అవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ,గత 9 ఏళ్ల పాలనా కాలంలో ఫక్తు రాజకీయ పార్టీగా మారి ప్రజల ఆకాంక్షలను పూర్తిగా దెబ్బ తీసిందని విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని, అవినీతికి పెద్ద పీట వేస్తూ, ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తూ,తెలంగాణా ప్రత్యేక అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ, ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆవినీతి విధానాల ఫలితంగా రాష్ట్రమే అప్పుల ఊబిలో కూరుక పోయిందని,రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి,నిరుద్యోగం రాజ్యమేలుతున్నదని, ఎప్పటి లాగే తెలంగాణాలో ఆదాయభద్రత లేమితో, నిత్యం అవమానాలతో వ్యవసాయ కుటుంబాలలో సంక్షోభంలో కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివాసీలకు హక్కులు లభించలేదని,పాలనలో వెనుకబడిన తరగతుల, దళితుల,ఆదివాసుల, గిరిజనుల,మహిళలకు భాగస్వామ్యం లేదని, విద్యా,వైద్య రంగాలు పూర్తిగా మూలన పడ్డాయని,ప్రజల,ప్రజా సంఘాల,ప్రతిపక్ష కదలికలపై పూర్తి నిఘా కొనసాగుతూ,భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు.
తాజాగా స్వంత పార్టీ పేరులో తెలంగాణా పదాన్ని కూడా తొలగించుకుని,ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా పక్కకు నెట్టేసిందన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపి,రాజ్యాంగ బద్ధంగా తెలంగాణా ప్రజలకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నదని,రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని, అడవులు,నదీ జలాలు, సాగు నీటి ప్రాజెక్టుల లాంటి సహజ వనరులపై కబ్జా కోసం ప్రయత్నాలు చేస్తున్నదని,రాష్ట్ర ప్రభుత్వాలకు సహజంగా ఉండే రాజ్యాంగ హక్కులను కూడా కబళిస్తున్నదని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామిక దృష్టికోణంతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకోసం ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో విఫలమయ్యాయన్నారు.ఈ నేపధ్యంలో మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణా ప్రజల ఆకాంక్షలను ఎజెండాగా తీసుకుని ఐక్య ఉద్యమాలు నిర్మించి, భవిష్యత్ తెలంగాణాని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, సహజ వనరుల సంరక్షణ, జీవనోపాధుల కల్పన, ప్రజాస్వామిక పాలన సాధన లక్ష్యంగా మన ఆలోచనలను కలబోసుకోవడానికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి.
తెలంగాణా జన సమితి మార్చ్10న హైద్రాబాద్ లోని వి.ఎస్.టి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ బచావో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నదని తెలిపారు.ఈ సదస్సు లక్ష్యం ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనకోసం రాష్ట్రంలో ఉమ్మడి ఉద్యమ నిర్మాణమని ఈ సదస్సులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపనిచ్చారు.