సూర్యాపేట జిల్లా:పిల్లలకు మద్యం,పొగాకు ఉత్పత్తులు విక్రయించడం,బహిరంగంగా మద్యం తాగడం,ధూమపానం (సిగరెట్) చేయడం లాంటివి చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ,) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని, అక్రమ సిట్టింగ్లు,బహిరంగంగా మద్యం,సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.
ఇలాంటివి చూసి వాటికి పిల్లలు అలవాటుపడి తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉన్నదని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని,ఇలాంటివి బహిరంగంగా చేయడం మానుకోవాలని సూచించారు.
మైనర్ పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దు అని హెచ్చరించారు.వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని గుర్తు చేశారు.