సూర్యాపేట జిల్లా:భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు జీవించడానికి సమాన హక్కులు కల్పించిందని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు అన్నారు.
నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన అధికారులందరితో భారత రాజ్యాంగం పీఠిక ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతరత్న, బాబా సాహెబ్,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో రూపకల్పన చేసిన రాజ్యాంగం ప్రతి పౌరునికి జీవించడానికి సమాన హక్కులు కల్పించిందని,రాజ్యాంగ సూత్రాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.స్వాతంత్రం వచ్చాక డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ కమిటీ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అమెరికా,లండన్,రష్యా, ఆస్ట్రేలియా,హంగేరీ,జర్మనీ,కెనడా తదితర దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించిన భారత రాజ్యాంగం 1949,నవంబర్,26 తేదీన ఆమోదించగా,1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు.తదనంతరం ఈ 73 సంవత్సరాల కాలంలో ప్రజల అవసరాల మేరకు 106 సార్లు సవరణలు చేయడం జరిగిందని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఈ దేశ ప్రజలకు నేను కత్తి ఇవ్వడం లేదు ఓటు అనే ఆయుధం ఇచ్చానని, దీనిని వినియోగించి రాజులు అవుతారో లేక అమ్ముకొని బానిసలు అవుతారో అని మంచి మాట చెప్పారని,అది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతైనా సముచితమని అన్నారు.భారతరత్న అబ్దుల్ కలాం ఓటు విలువ ప్రాశస్యాన్ని తెలిపారని,ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.