సూర్యాపేట జిల్లా: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (UPSC CSE 2022 Results) ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.తెలంగాణకు చెందిన యువతి నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిశారు.
ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం విశేషం.ఆయన సూర్యాపేట ఎస్పీగా పని చేసిన విషయం తెలిసిందే.
దీనితో జిల్లా వ్యాప్తంగా ఉమా హారతి సాధించిన విజయానికి ప్రశంసల జల్లు కురుస్తోంది.కుటుంబ సభ్యులు,స్నేహితులు ఆనందంలో మునిగితేలారు.
ఈ సందర్భంగా ఉమా హారతి మీడియాతో మాట్లాడారు.తాను సివిల్స్లో విజేతగా నిలవడానికి గల కారణాలను పంచుకున్నారు.
ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను.మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు.రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్ని.ముందుగా జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టు ఉండేది.
ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను.ఐదేళ్లుగా నేను ప్రిపేర్ అవుతున్నాను.
ఈ ప్రాసెస్లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్ సపోర్టు చాలా అవసరం.అది ఉంటే చాలు.
సమాచారం, పుస్తకాలు అన్నీ ఆన్లైన్లో ఉచితంగా దొరుకుతాయి.కానీ, ఎమోషనల్,ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా అదే చాలా అవసరం.
మహిళలు,పురుషులు ఎవరైనా సరే కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు.
ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయినా నిరాశ పడొద్దు.
ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు.నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా.
ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్ చూశాను.అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లాను.నేను ఐఐటీ హైదరాబాద్లో సివిల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను.ఆ తర్వాత ఉద్యోగంలో చేరలేదు.సివిల్స్ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాను.నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు.
సివిల్స్ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను.నా ఫ్రెండ్స్ చాలా సపోర్టు చేశారు.
నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి, ప్రేరణ.