సూర్యాపేట జిల్లా:గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ,ప్రజల అవసరాలను తీర్చేందుకు గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నుకున్న ఓ సర్పంచ్, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ దందాకు తెరలేపి,రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన నాటుసారా (గుడుంబా)వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తూ,తన అక్రమ సారా దందాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎక్సైజ్ సిబ్బందిపై ట్రాక్టర్ తో దాడి చేసి చంపేందుకు తెగబడిన దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా( Suryapet District )లో మంగళవారం రాత్రి జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది.ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా మోతె మండలం గోపతండా గ్రామ సర్పంచ్ గొర్రె తిరుపతి తన ట్రాక్టర్ డ్రైవర్ గుగులోతు సురేష్ తో ( Suresh )కలిసి గత కొంత కొంతకాలంగా గ్రామంలో గుడుంబా వ్యాపారం చేస్తున్నారు.
నాటుసారా తయారీకి అవసరమైన నల్లబెల్లం,పటిక తన ట్రాక్టర్ లోనే అక్రమంగా తరలిస్తూ సారా వ్యాపారం జోరుగా సాగిస్తున్నాడు.అందులో భాగంగానే మంగళవారం రాత్రి కూడాతన ట్రాక్టర్లో మోతె మండల కేంద్రం నుండి 950 కిలోల నల్లబెల్లం,50 కిలోల పటిక,22 లీటర్ల నాటుసారా తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచరంతో ఎక్సైజ్ శాఖ( Excise ) అప్రమత్తమైంది.
వెంటనే రంగంలోకి దిగిన ఎక్సైజ్ సిబ్బంది అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.దానితో నన్నే ఆపుతారా అని ఆగ్రహావేశాలకు లోనైన సర్పంచ్ సాబ్ వారిని ఎక్కించేయ్ అనడంతో ట్రాక్టర్ డ్రైవర్ గుగులోతు సురేష్ ట్రాక్టర్ ను ఎక్సైజ్ సిబ్బంది వాహనాన్ని ఢీ కొట్టి ట్రాక్టర్ తో పరారవుతుండగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఆలీ ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ ని వెంబడించాడు.
ఆలీని ట్రాక్టర్ తో గుద్ది కొంత దూరం వరకు అలాగే ఈడ్చుకు వెళ్ళటంతో అతనికి గాయాలు కాగా,ద్విచక్ర వాహనం ధ్వంసం అయింది.వెంటనే సర్పంచ్,డ్రైవర్ ట్రాక్టర్ వదిలేసి అక్కడి నుండి పరారయ్యారు.
దీనిపై ఎక్సైజ్ సిబ్బంది మోతె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు సర్పంచ్ గొర్రె తిరుపతి, ట్రాక్టర్ డ్రైవర్ గుగులోతుసురేష్ పై మోతె పోలీస్ స్టేషన్లో అత్యాయత్నం కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.ఘటనా స్థలం నుంచి ట్రాక్టర్,ద్విచక్ర వాహనం,నల్లబెల్లం,పట్టికతో సహా గుడుంబాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తనిఖీల్లో-ఎక్సైజ్ సీఐ తిరుపతిరెడ్డినల్లగొండ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తనిఖీల్లో భాగంగా కోదాడ నియోజకవర్గం మోతె మండల కేంద్రం సమీపంలోనిషేధిత నాటుసారా తయారీకి అవసరమైన నల్లబెల్లం,పటికను తరలిస్తున్న ట్రాక్టర్ ను అధికారులు వెంబడించారు.ఆ క్రమంలో అధికారుల వెహికల్ ను గ్రామ సర్పంచ్ మరియు డ్రైవర్ కలిసి ట్రాక్టర్ తో ఢీకొట్టడం జరిగింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రాక్టర్ ను ఆపి మోతె పోలీస్ స్టేషన్లో 307 క్రింద కేసు నమోదు చేయడం జరిగింది.దానితోపాటు సూర్యాపేట ఎక్సైజ్ ఆఫీసులో మరో కేసు నమోదు చేశాం.