సూర్యాపేట జిల్లా:ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సహకారం,కోదాడ పట్టణ పోలీసుల తక్షణ చర్యలు,యాదాద్రి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పందించిన తీరుతో కోదాడలో గంజాయికి బానిసైన బాలుడు జీవితానికి ఓ వెలుగు దారి దొరికింది.మీడియా,సోషల్ మీడియా వచ్చిన ఒక్క వార్తతో గంజాయి విక్రయించే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మత్తు పదార్థాలకు బానిసైన బాలుడికి కన్నతల్లే కట్టేసి కారం ట్రీట్మెంట్ ఇచ్చిన వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కోదాడ పోలీసులు అలర్ట్ అయ్యారు.పట్టణంలో అక్రమార్కుల భరతం పట్టేందుకు అణువణువు సోదాలు మొదలు పెట్టారు.
అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేయడంతో గంజాయి సేవించలన్న ఆలోచన ఉన్న యువత,విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకోవాలనే అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది.దీనితో విక్రయించే వారు,విచ్చలవిడిగా సేవించే వారు కూడా బయటికి రావడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తప్పుడు మార్గంలో వెళుతున్న కొడుకును కట్టేసి కంట్లో కారం చల్లిన కన్నతల్లి ఘటనపై యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కేతావత్ నవీన్ కుమార్ నాయక్ స్పందించారు.బాధిత బాలుడిని కోదాడ నుండి హైదరాబాద్ గాంధీ హాస్పటల్ కు తరలించి,దగ్గరుండి ఆరోగ్య పరమైన పరీక్షలన్ని చేయించి,కౌన్సిలింగ్ ఇప్పించారు.
మత్తు పదార్ధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న 15 వేల మంది పైగా పిల్లలకు ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.అంతే కాకుండా కొంత మంది పిల్లలకు ఉన్నత విద్యనందిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఎక్సైజ్ అధికారి సేవల గురించి తెలుసుకున్న వారు ఆయన చేస్తున్న కృషికి హర్షం వ్యక్తం చేస్తూ హేట్సాఫ్ నవీన్ కుమార్ నాయక్ అంటున్నారు.సమాజంలో అన్ని వర్గాల వారు స్పందిస్తే చెడు మార్గంలో పయనించే వారిని కూడా సన్మార్గంలో పెట్టొచ్చనే దానికి ఈ సంఘటన ఋజువని సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.