సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కేసారం గ్రామంలో ఐకెపి సెంటర్ల నిర్వాహకులు నయా దందాకు తెరలేపారు.రైతులు ఐకెపి సెంటర్ కు తెచ్చిన ధాన్యంలో ఒక్కో రైతు నుండి ఒక్కో డబ్బా (సుమారు 20కేజీలు) సేకరిస్తూ వేర్వేరు రైతుల ఖాతాల నుండి వందల బస్తాల ధాన్యం అమ్ముకోవడంతో పాటు,ఐకెపి సెంటర్లో పోసిన ధాన్యం రాశుల నుండి రాత్రి వేళల్లో సెంటర్ ను నిర్వహిస్తున్న మహిళలు బస్తాల కొద్ది ధాన్యం దొంగిలిస్తూ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు.
ఆదివారం రాత్రి సెంటర్ లో ఓ రైతు ధాన్యం రాశి నుండి నలుగురు మహిళా నిర్వాహకులు ధాన్యం దొంగిలిస్తుండగా రైతు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నిర్వాహకుల బండారం బట్టబయలు అయింది.దీనితో విషయం బయటికి పొక్కకుండా గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసి ఐకెపి సెంటర్ కి వెళ్ళిన మీడియాతో బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.బాధిత రైతులు మాట్లడుతూ రైతుల వద్ద అక్రమంగా డబ్బా ధాన్యం తీసుకోని ఒక రాశి పోసుకొని, రాత్రివేళ రైతులు లేని సమయంలో బస్తాల కొద్ది ధాన్యం దొంగిలించి వారి రాశిలో పోసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.
ఇప్పటికే 8 వందల బస్తాల ధాన్యం అమ్ముకున్నారని ఆరోపించారు.ఈ విషయాన్ని తాము ఆదివారం రాత్రి అక్కడ వుండగానే నలుగురు ఐకెపి నిర్వహకులు వచ్చి వడ్లు బస్తాలలోకి ఎత్తుతుండగా పట్టుకున్నామని,దీనిపై గ్రామ పెద్ద మనుషులు పంచాయితీ చేస్తున్నారని చెప్పారు.
ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, గిట్టుబాటు ధర రాక,కౌలుకు తీసుకున్న భూమికి కౌలు డబ్బులు కూడా వెళ్ళక ఇబ్బందులు పడుతుంటే,ఐకెపి నిర్వహకులు ఈ విధంగా మోసానికి పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు.వెంటనే ఐకెపి నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత రైతు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ మాది కేసారం గ్రామం.20 రోజుల క్రితం ఐకెపి సెంటర్ కి ధాన్యం తెచ్చాం.ఇంత వరకు కాంటాలు వేయకుండా అనేక సాకులు చెబుతున్నారు.నిర్వహకులు ఒక్కో రైతు వద్ద డబ్బా వడ్లు తీసుకుంటున్నారు.ఆదివారం రాత్రి కళ్ళంలో పోసిన ధాన్యం నుండి నలుగురు మహిళా నిర్వహకులు బస్తాలలో దొంగతనంగా ధాన్యం ఎత్తుతుండగా పట్టుకున్నాను.ఈ విషయమై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
ఇలాగే అన్ని రాశులను నుండి ధాన్యం దొంగిలించి ఇప్పటికే 800 బస్తాల కాంటా వేశారు.వారిపై చర్యలు తీసుకోవాలి.
ఇదే విషయమై డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ వివరణ కోరగా కేసారం గ్రామంలోని ఐకెపి సెంటర్ లో ధాన్యం దొంగిలించిన విషయం మా దృష్టికి వచ్చింది.జరిగిన ఘటనపై విచారణ చేపడతాము.
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.