సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి,దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు.
ఈ పోరాటం మూలంగా వెట్టి చాకిరి నుండి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు.ఈ పోరాటంలో 3000 మంది కమ్యూనిస్టు యోధులు మరణించారని 4500 గ్రామాలు వెట్టి నుండి విముక్తి అయ్యాయని అన్నారు.
సాయిధ పోరాటం మూలంగా పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పంచి పెట్టారని గుర్తు చేశారు.తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధంలేని బిజెపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలియని మూర్ఖుడు బండి సంజయ్ అని నాటి కమ్యూనిస్టుల త్యాగాలను అవహేళనగా చేస్తూ మాట్లాడడం సబబు కాదన్నారు.తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించి అమరవీరుల త్యాగాలను పోరాటాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.
సెప్టెంబర్ 17న అర్వపల్లి మండల కేంద్రంలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని అన్నారు.వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చే పనిలో నరేంద్ర మోడీ నిమగ్నమయ్యారని వారన్నారు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల యొక్క తీర్పులకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలని కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు.కేంద్రంలోని మోదీ సర్కార్ అదానీ,అంబానీ వంటి కార్పొరేట్శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు బిజిపి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.పరిశ్రమలు, ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే సంపదంతా వారి వద్దే కేంద్రీకృతమవుతుందన్నారు.
దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బిజెపికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు,పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి,జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,బుర్రి శ్రీరాములు,మట్టిపెళ్లి సైదులు, ఎల్గూరి గోవింద్,కోట గోపి,దండ వెంకటరెడ్డి, వేల్పుల వెంకన్న,జిల్లపల్లి నరసింహారావు,వీరబోయిన రవి,చెరుకు ఏకలక్ష్మి,మేకనపోయిన శేఖర్,కొప్పుల రజిత,మేకనపోయిన సైదమ్మ,మద్దెల జ్యోతి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,దేవరం వెంకటరెడ్డి, పారేపల్లి శేఖర్ రావు,కొదమగుండ్ల నగేష్,నగారపు పాండు,షేక్ యాకోబ్,పల్లె వెంకటరెడ్డి,దుగ్గి బ్రహ్మం, పాండు నాయక్,బుర్ర శ్రీనివాస్,కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం,మిట్టగడుపుల ముత్యాలు,వట్టెపు సైదులు,జుట్టుకొండ బసవయ్య,చిన్నపంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.