సూర్యాపేట జిల్లా:ఓ కుమారుడు మద్యం మత్తులో విచక్షణ మరిచి కన్నతల్లినే కడతేర్చిన అమానుషపు ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామనికి చెందిన పుట్టబంతి రాములమ్మ (70) కుమారుడు పుట్టబంతి వీరేష్ తో కలిసి రెండు సంవత్సరాల క్రితం తమరబండపాలెం పరిధిలోని సుందరయ్య నగర్ కు వలస వచ్చి నివాసం ఉంటున్నారు.తాపీ పని చేసే రాములమ్మ కుమారుడు వీరేష్ మద్యానికి బానిసై నిత్యం తాగొస్తూ తల్లిని చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు.
బుధవారం కూడా మద్యం సేవించి వచ్చిన కుమారుడిని తల్లి తాగొద్దని వారించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.తాగిన మైకంలో ఉన్న కుమారుడు కన్నుమిన్ను తెలియక తల్లిని గొంతు నులమడంతో ఊపిరాడక మృతి చెందింది.
విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్ఐ అనిల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి,నిందితుడు వీరేష్ ను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.