సూర్యాపేట జిల్లా:ఈనెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ లో సోమపంగు కిరణ్ నగర్ లో జరిగిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ద్వితీయ మహాసభలు నేటితో ముగిశాయి.ఈ మహాసభల్లో 25 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.
సంఘం నూతన జిల్లా అధ్యక్షులుగా మర్రి నాగేశ్వరరావు,జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట గోపి ఎన్నికవ్వగా,ఉపాధ్యక్షులుగా మీసాల వీరబాబు, డి.దుర్గారావు,బోయిల్ల అర్జున్,పిండిగ నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శిలుగా గుద్దేటి వెంకన్న, టేకుల సుధాకర్,నందిగామ సైదులు,దేవరకొండ యాదగిరిలను కార్యదర్శివర్గ సభ్యులుగా,మరో 15 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కోట గోపి మాట్లాడుతూ జిల్లాలోని దళితులందరికీ దళిత బంధు అందించాలని,ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని,ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా నిధులు కేటాయించి దళితవాడల అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.గ్రామాలలో ఇప్పటికీ కనబడని రూపంలో కొనసాగుతున్న కుల వివక్ష,అంటరానితనం నిర్మూలనకు సమరశీల పోరాటాలు చేస్తామన్నారు.
ఎస్సీ కార్పొరేషన్కు సంవత్సరానికి 500 కోట్ల రూపాయల కేటాయించాలని,దళితులపై జరుగుతున్న దాడులను,హత్యలను,అత్యాచారాలను అరికట్టాలని, కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించే చట్టం చేస్తూ జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, అర్హులైన దళితులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇవ్వాలని,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని మహాసభలో తీర్మానాలు చేసినట్లు తెలిపారు.