తారు రోడ్డుపై కప్పుకున్న చెర్వుమట్టి.వర్షంతో చిత్తడిగా మారిన రోడ్డు.
వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి.నాలుగు కి.మీ.మేర ఇదే తంతు.ఇటుక బట్టిల మట్టి మాఫియా విచ్చలవిడి తనం.వేల ట్రిప్పుల మట్టి తోలకాలతో తారు రోడ్డుపై పేరుకుపోయిన మట్టి మేటలు.రోడ్డుపై మట్టిని తొలగించాలన్న జ్ఞానం లేని మట్టి మాఫియా.చర్యలు తీసుకోవాలన్న సోయి లేని అధికార యంత్రాంగం.ప్రమాదాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.స్కూల్ పిల్లలు,ఉద్యోగ,ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు.
అక్రమంగా చెరువుల మట్టి తవ్వకాలు.ఊరికి దగ్గరలో రోడ్డుకు ఇరువైపులా ఇటుక బట్టీలు.
ఇటుక బట్టీల నిర్వహణలో ప్రభుత్వం నిబంధనలు బేఖాతరు.
సూర్యాపేట జిల్లా:ఇటుక బట్టీలకు అక్రమంగా చెరువు మట్టిని తరలించడం,అడ్డదారిలో సొమ్ము చేసుకోవడం జిల్లాలో ఒక అనధికార ఆదాయ మార్గంగా మారిందని చెప్పొచ్చు.అయినా మైనింగ్,ఐబి,రెవిన్యూ అధికారులకు ఇవేవీ కనిపించకపోవడం గమనార్హం.ఈ మట్టి మాఫియా విచ్చలవిడిగా మట్టి తోలకాలు చేయడం ద్వారా ట్రాక్టర్ల నుండి జారిపడిన మట్టి ఏకంగా ఓ తారు రోడ్డును నాలుగు కి.మీ.మేర బురదమయంగా మార్చిందంటే అతిశయోక్తి కాదు.ఇంత జరుగుతున్నా ఏ ప్రజాప్రతినిధికి,అధికారికి రోడ్డు పరిస్థితి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.తారు రోడ్డుపై మట్టి పేరుకుపోయి,వర్షంతో చిత్తడిగా మారి వాహనాలు స్కిడ్ అవుతూ,చక్రాల్లోకి మట్టి దూరి ముందుకు కదలక ఆగిపోతుండడంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.
దీనితో స్కూల్ పిల్లలు,ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మికవర్గాల వారు పాఠశాలకు,ఆఫీసులకు,పనులకు ఆలస్యంగా వెల్లాల్సిన పరిస్థితి హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలంలో దాపురించింది.సోమవారం ఉదయం పత్తేపురం నుండి మేడారం వరకు,నేరేడుచర్ల నుండి జాల్నాలదిన్న వరకు వెళ్లే రోడ్లపై మట్టితో వాహనదారులు కుస్తీ పడుతున్న దృశ్యాలు కంపించాయి.
తారురోడ్డుపై సుమారు నాలుగు కి.మీ.మేర చెరువు మట్టిపడి,ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మట్టి రోడ్డుగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సోమవారం ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు,ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు,వివిధ పనులకు వెళ్లే కార్మికులు,వ్యాపారుల వాహన చక్రాలకు మట్టి అతుక్కుపోయి వాహనం ముందుకు కదలకపోవడంతో వాహనాలు నిలిపి,ఆ మట్టి తీసుకోలేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చెరువు మట్టిని ఇటుక బట్టీలకు తరలించే క్రమంలో ట్రాక్టర్లలో మట్టి కింద పడి మట్టి రోడ్డు మీద పేరుకుపోయింది.దీంతో ఒకరిద్దరు వాహనదారులు కింద పడిపోయారు, కొందరికి గాయాలు కూడా అయ్యాయి.
మట్టిని తరలించిన మట్టి మాఫియా డోజర్ తో రోడ్డు శుభ్రం చేయించాలన్న బాధ్యత లేకుండా ఉంటే,వారితో రోడ్డు శుభ్రం చేయించాల్సిన అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతుందా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఈ మట్టిని రోడ్లపై తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
పెను ప్రమాదం జరగకముందే అధికారులు మేలుకుంటారా లేదా మొద్దు నిద్ర నటిస్తూనే ఉంటారా అనేది చూడాలి మరి!
.