మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రం పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని రుద్రేశ్వరలయంతో పాటు వివిధ శివాలయాలలో మంత్రి జగదీష్ రెడ్డి సునీత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేత బండి సంజయ్ పై సెటైర్లు విసిరారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని యాత్రలు ఢిల్లీ వైపే ఉన్నాయని, తెలంగాణాలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు.పాదయాత్రలు చేసినా,మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల యాత్రలు ఢిల్లీ వైపే మళ్లాయని చెప్పారు.
ఢిల్లీ కోట నుండి బీజేపీని దించాలన్నదే దేశంలో చర్చ జరుగుతోందన్నారు.మోడీ సర్కార్ ను దించాలన్నది దేశప్రజల నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని ఒక్కటి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ప్రకటించారు.
రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసునని,2014 కు ముందు వెనుక అన్నదే ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు.ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటన్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
తెలంగాణా జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపిండని, సంజయ్ లాంటి వారిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని తేల్చిచెప్పారు.పాదయాత్ర చేసినా ఆయన ప్రజలకు చెప్పేది ఏమి ఉండదని, గుజరాత్ లో 25 ఏండ్ల బీజేపీ ఎలుబడిలో ఒక్క నిమిషం కరెంట్ ఉచితంగా ఇచ్చారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ కిట్, కళ్యాణాలక్ష్మి/షాదిముబారక్, రైతుబంధు,రైతు భీమాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు పరచడం లేదన్నారు.యాత్రలలో సంజయ్ ప్రజలకు ఏమి చెబుతాడని, పెట్రోల్ 100,డీజిల్ 100,గ్యాస్ 1000 కి పెంచినమని చెబుతారా అని దెప్పిపొడిచారు.
ఓట్లు వేస్తే మళ్ళీ డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరలు పెంచుతామని చెబుతారా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.