మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని,పేదవర్గాల అప్లికేషన్లు రిజెక్ట్ చేసి, అనర్హులకు జాబితాలో చోటు కల్పించారని, ఇదెక్కడి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఎంపిక సారూ అని కాంగ్రెస్ మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను, స్థానిక ప్రజా ప్రతినిధిని ప్రశ్నించారు.శుక్రవారం కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఆర్డీవో ఆఫీస్ ను బాధితులతో కలిసి ముట్టడించి,గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
అనంతరం బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులతో కూడిన వినతిపత్రం ఆర్డీవోకు అందజేసిండ్రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43,35వ వార్డులో ఒకే ఇంట్లో నుంచి నాలుగు,ఐదు అప్లికేషన్లు రాగా వాటికి అర్హుల జాబితాలో చోటు కల్పించారని,అదే ప్రాంతంలో అర్హుల ధరఖాస్తులను రిజెక్ట్ చేసిండ్రన్నారు.48 వార్డుల్లో ఇదే రకమైన జాబితాను తయారు చేసి పేదలకు అన్యాయం చేసిండ్రని ఆరోపించారు.
ఇదే విషయమై గంటన్నరపాటు ఆందోళన చేయటంతో పాటు ఆర్డీవో చెన్నయ్యకు ఆధారాలతో సహా వివరించారు.
ఇళ్లు లేని పేదల అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుని డ్రాలో పార్టిస్పేట్ చేసే ఛాన్స్ కల్పించాలని డిమాండ్ చేసిండ్రు.మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెప్పిన అంశాన్ని పరిశీలించిన ఆర్డీవో రిజెక్ట్ చేసిన అప్లికేషన్లపై రీ వెరిఫికేషన్ చేయించి డ్రా బాక్స్ లో వేయిస్తమని హామీ ఇయ్యటంతో ఆందోళన విరమించిండ్రు.
కాగా పార్టీలకు అతీతంగా అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను చేపట్టాలని 43వ వార్డు కౌన్సిలర్ జానిపాష ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును,ఆర్డీవో, పోలీస్ అధికారులను అందరి సమక్షంలోనే ప్రాథేయపడటం చర్చనీయాంశమైంది.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, కొమ్ము శ్రీనివాస్,దేశిడి శేఖర్ రెడ్డి,పట్టణ నేతలు విజయ్కుమార్,పోలగాని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
.