సూర్యాపేట జిల్లా:2023 ఫిబ్రవరి నెలలో టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు కాబోతుందని,మే నెలలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ,మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేవుతున్నాయి.సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలంలో వెలిదండ,కోనాయిగూడెం,కుతుబ్ షా పురం,గడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతు భరోసాయాత్ర,రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికలలో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల్లో ఉండనని ఉత్తమ్ శపథం చేశారు.
టీఆర్ఎస్ నాయకులు చేసే భూ కబ్జాలు,అరాచకాల గురించి జిల్లా కలెక్టర్,ఎస్పీల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని తెలిపారు.
ధరణి వల్ల ధనవంతులకు తప్ప పేదలకు న్యాయం జరగలేదని, దాని స్థానంలో మెరుగైన వ్యవస్థను తీసుకు వస్తామని అన్నారు.రెవెన్యూ,పోలీస్ అధికారులు ప్రభుత్వంతో కలిసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అణిచి వేస్తున్నాయని,అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని అధికారులు గ్రహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.