సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కుతుబ్ షా పురం గ్రామపంచాయతీ సర్పంచ్,ఎంపీటీసీల భర్తలు భూకబ్జాలతో అరాచకకం సృష్టిస్తూ,ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులు చేస్తున్నారంటూ బాధితులు సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ అనే బాధితుడు మాట్లాడుతూ అనాదిగా తమ కబ్జాలో ఉన్న 453 సర్వే నెంబర్లోనే తాము కూడా ఎకరం భూమి కొన్నామని తప్పుడు పత్రాలు సృష్టించి సర్పంచ్, ఎంపీటీసీ భర్తలు గత నాలుగేళ్లుగా భూ కబ్జాకు పాల్పడుతూ తమపై దాడులు చేస్తున్నారని వాపోయాడు.
రెవెన్యూ,పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారికే సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.సర్పంచ్ ఇంటి ముందే తన తమ్ముడిపై దాడి జరిగిందని,అక్కడ సిసి కెమెరా ఉందని,కనీసం ఫుటేజ్ చూడకుండా,ఫోన్ వాయిస్ రికార్డులను పరిశీలించకుండా పోలీసులు సర్పంచ్, ఎంపీటీసీ భర్తలకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించాడు.
వారు 453 సర్వే నెంబర్లో పల్లె ప్రకృతి వనం కోసం ఏర్పాటు చేసిన భూమిలో నాట్లు వేసినా ప్రభుత్వ అధికారులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు.