సూర్యాపేట జిల్లా:భిన్న మతాలకు,విభిన్న సంస్కృతులకు,అత్యున్నత సాంప్రదాయాలకు నిలయం భారత దేశమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈసీ మెంబర్ నాతి సవేంధర్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శివమ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గొండ్ర అశోక్,కళాశాల కరస్పాండెంట్ వంగపల్లి శంకర్ లతో కలిసి ఆయన ముఖ్యాతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాశంలోని హరివిల్లులో ఏడు రంగులు ఉన్నట్లుగానే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు పేరుగాంచిన భారతదేశం కూడా విభిన్న మతాలకు,కులాలకు నిలయంగా ఉందని తెలిపారు.ఒకరి మత స్వేచ్చను వేరొక మతస్తులు గౌరవించడం ఇక్కడ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
హిందువులకు దసరా, దీపావళి పండుగలు ఎంత పవిత్రమైనవో ముస్లిం సోదర,సోదరీమణులు ఈ రంజాన్ పండుగను కూడా అంతే పవిత్రంగా భావిస్తారని అన్నారు.ఈ పండుగ దినములలో ముస్లింలు అల్లాను ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సాయిచంద్ర పారామెడికల్ కళాశాల కరస్పాండెంట్ పట్టేటి సుధీర్ బాబు,ఉపాధ్యాయులు అలుగుబెల్లి సతీష్,బి.మధుసూదన్ రెడ్డి,సతీష్ రెడ్డి,శ్రీనివాస్ నాయక్,వెంకటేశ్వర్లు,విద్యార్థులు సాయి,షఫి, పరమేష్,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.