సూర్యాపేట జిల్లా:దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్ర భాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారని అన్నారు.వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి, జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు.1934 వ సంవత్సరంలో తన సొంత గ్రామం కృష్ణా జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి,వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని అన్నారు.పార్లమెంటుకు,శాసనసభకు సైకిల్ పై వెళ్లే వారన్నారు.
సమాజమే నా పిల్లలు అనుకుని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు.చట్టసభలకు వన్నెతెచ్చిన మహానేత సుందరయ్య అని,ఆయన పార్లమెంటు,అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ,ఆదర్శ నేతగా ఉంటూ,ప్రతిపక్ష,అధికార పక్ష నేతల మన్ననలు పొందారని అన్నారు.
నేడు ఎంతోమంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని,విలువలను మరిచి అక్రమ సంపాదనకు,పదవి వ్యామోహంతో డబ్బు కోసం పార్టీలు మార్చి,ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు.నేటి యువత సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయసాధన కోసం కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కోలిశెట్టి యాదగిరిరావు,మట్టిపెళ్లి సైదులు,ఏలుగూరి గోవింద్,కోట గోపి,వేల్పుల వెంకన్న,చెరుకు యాకలక్ష్మి,జిల్లేపల్లి నరసింహారావు, మేకనబోయిన శేఖర్,కొప్పుల రజిత,చిన్నపంగ నరసయ్య,నాయకులు బత్తుల వెంకన్న,మామిడి సుందరయ్య,నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.