సూర్యాపేట జిల్లా:జిల్లాలో పౌష్టికాహారం అందించుటలో అంగన్వాడీ కేంద్రాలు ముందుండాలని జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు అంగన్వాడీ సూపర్వైజర్లకు,సీడీపీవోలకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరై రిజిస్టర్ల నమోదు మరియు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యత పెంపొందించుకోవడం వంటి పలు విషయాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యపై టీచర్లు పూర్తి స్థాయిలో అవగహన పెంచుకొని కాలానుగుణంగా పిల్లల్లో విద్యపై మక్కువ పెంచే విధంగా కృషి చేస్తూ,గర్భిణులు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని సూచించారు.
క్రమం తప్పకుండా లబ్ధిదారులు టీకాలు తీసుకునే విధంగా చొరవ తీసుకొని వారి ఆరోగ్యవంతమైన జీవితానికి అండగా నిలవాలని కోరారు.అదే విధంగా ప్రతి నెల తల్లిపిల్లల ఎత్తులు, బరువులు చూస్తూ పోషణలోపంతో బాధేపడే వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందజేయాలని,న్యూట్రిషన్ రిహాబీటేషన్ సెంటర్స్ కు కూడా సిఫార్సు చేసి జిల్లాలో పోషణ లోపం లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో రిజిస్టర్లను,బరువు తూకే పరికరాలను,పౌష్టికాహార నాణ్యతను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సీడీపీవోలు విజయలక్ష్మీ, కిరణ్మయి,అనంతలక్ష్మి,శ్రీజ,శ్రీవాణి,సాయిగీత,రూప సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.