సూర్యాపేట జిల్లా: పార్లమెంట్,రాష్ట్ర శాసనసభలు,స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు(జమిలి ఎన్నికలు) జరగాలన్న రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్ లో “జమిలి ఎన్నికలను వ్యతిరేకించండి”అని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ జమిలి ఎన్నికల వలన డబ్బు చాలా ఆదా అవుతుందని,పదేపదే ఎన్నికల వలన అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వాస్తవంలేని వాదనను బీజేపీ చేస్తుందన్నారు.
జమిలి ఎన్నికల నమూనాను అమలు జరిపితే రాజ్యాంగం యొక్క రెండు మౌలిక పునాదులైన ప్రజాస్వామ్యం,సమైక్య విధానాలు దెబ్బతింటాయన్నారు.
రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని కేశవ నందభారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించడం అంటే అది కొన్ని శాసనసభల కాలపరిమితిని హరించేందుకు దారితీస్తుందన్నారు.ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి శాసనసభ రద్దు చేయాల్సి వస్తే మిగతా కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నిక నిర్వహించబడుతుందని, రాజ్యాంగంలో,ప్రజలు ఐదేళ్ల కాలానికి తమ ప్రతినిధుల్ని ప్రజలను ఎన్నుకునే హక్కు పొందపరిచిందన్నారు.జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై కోవింద్ సిఫారసుల వలన ఈ హక్కు ఉల్లంఘనకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.2029 నుంచి ఒకే దేశం,ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదని చెప్తూ వస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్వహరిస్తుందని విమర్శించారు.గత సంవత్సరం 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయని,వీటికి 2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి ఉందన్నారు.
అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు.హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ,నాగాలాండ్, త్రిపుర,కర్ణాటక, తెలంగాణ,మిజోరాం, మధ్యప్రదేశ్,చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల,రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు,కోట గోపి,చెరుకు యాక లక్ష్మి,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న,ధనియాకుల శ్రీకాంత్,వీరబోయిన రవి, మేకన బోయినశేఖర్, చిన్నపంగా నరసయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు,నాయకులు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.