సూర్యాపేట జిల్లా: అధికార కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించాలని జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు సూచిస్తున్నా అధికార పార్టీకి చెందిన కొందరు సూచనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.తాజాగా కోదాడ బాబూజి గ్రంథాలయంలో నవంబర్ 14 నుండి బాలల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలతో లైబ్రరీ చైర్మన్ పాలకవర్గం లైబ్రరియన్ లు సంయుక్తంగా కరపత్రాన్ని ముద్రించారు.ఇందులో కోదాడ పట్టణ ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్ పర్సన్ పేరు ముద్రించక పోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి.
ప్రోటోకాల్ ప్రకారం పట్టణ ప్రథమ పౌరురాలి పేరు ముందుండాలి కానీ, ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఉన్నారని గ్రంథాలయ చైర్మన్ పాలకవర్గం సభ్యులు కరపత్రంలో ఆమె పేరు లేకుండా చేశారు.ఇది ఇలా ఉండగా స్థానిక మహిళా కౌన్సిలర్ చనిపోవడంతో ఆమె భర్త పేరు వేయడం పట్టణంలో పలు ఊహాగానాలకు తావిస్తుంది.
విభేదాలు ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్ పర్సన్ టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.అయినప్పటికీ ఎమ్మెల్యే అండ దండలు ఉన్నాయనో లేక మున్సిపల్ చైర్పర్సన్ ను అవమాన పరిచామని ఎమ్మెల్యే మెప్పు పొందడం కోసమో లైబ్రరీ చైర్మన్ పాలకవర్గం కరపత్రంలో ఆమె పేరు పెట్టకుండా ప్రోటోకాల్ విధానాన్ని అపహాస్యం చేశారు.
మహిళలకు అండగా ఉంటామని మహిళా సాధికారిత కల్పిస్తామని గొప్పలు చెప్పే నాయకులు వారి మాట వినకపోయేసరికి మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మరిచి కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు.గతంలో కూడా మున్సిపల్ చైర్ పర్సన్ తనను ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు అధికార కార్యక్రమాల్లో పాల్గొననీయకుండా నెట్టివేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది.అయినప్పటికీ కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే వర్గీయులు పంతా మార్చుకోకుండా మహిళా చైర్ పర్సన్ ని కించపరిచే విధంగా వివరిస్తుండడం గమనార్హం.
ఈ విషయంలో పట్టణ ప్రజలు ఎమ్మెల్యే వర్గీయుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.కరపత్రంలో కొందరు మహిళలకు ఎటువంటి పదవులు లేకపోయినా వారి పేర్లు ముద్రించి గొప్పగా ప్రచారం చేస్తున్నారు.
కరపత్రంలోని ఆ మహిళల పేర్లు చూసి కొందరు నవ్వుకుంటున్నారు ఇకనైనా హుందాగా ప్రవర్తించాలని స్థానికులు కోరుతున్నారు.