సూర్యాపేట జిల్లా:గ్రామీణ వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం( Central Govt ) పూర్తిగా విస్మరించిందని,గ్రామీణ వ్యవసాయ కార్మికులకు బడ్జెట్ కేటాయింపులో చవతి తల్లి ప్రేమ చూపించిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ఆరోపించారు.శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం( Telangana Agricultural Labor Union ) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టాన్ని పార్లమెంటు( Parliament )లో తీసుకురావాలని గ్రామీణ ఉపాధి హామీ పనులను పట్టణ ప్రాంతాల విస్తరణకు వందరోజుల పనిని రెండు వందల రోజులకు పెంచి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వడం కోసం అదనపు నిధులను కేటాయించాలని కోరుతున్న డిమాండ్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు రాయితీలను ప్రతిపాదించిన సీతారామన్ రైతులకు పేదల పెన్షన్లు,రేషన్ షాపులకు ఇచ్చే సబ్సిడీ ఆహార ధాన్యాలను తగ్గించడం సిగ్గుచేటన్నారు.
పెరుగుతున్న ధరలను నియంత్రణ చేయకుండా పెరిగే ధరలకనుగుణంగా కనీస వేతనాలను రివైజ్ చేసి పెంచకుండా ఏ విధంగా ఆర్థిక సామాజిక అసమానతులను రూపుమాపుతారో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వలస కార్మికుల నియంత్ర ఉచిత విద్య, వైద్యం మెరుగుపరచడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు విస్తరింపజేయాలని ప్రతిపాదనను ఆర్థిక శాఖ మంత్రి పట్టించుకోకపోవడంలో అర్థం లేదన్నారు.
ప్రైవేటు విద్యా,ఉపాధి రంగాలలో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా సామాజిక అసమానతులను ఆర్థిక అసమానతులను ఏవిధంగా తగ్గించడానికి అవకాశం ఉందో దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.ప్రతి పేదవాని ఎకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాం, విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం,సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ఎంతవరకు వచ్చిందనేది ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బీజేపీ మోసపూరిత విధానాలకు నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులుసు సత్యం,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి,చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎలుగురి గోవింద్, పట్నం డెవలప్మెంట్ జిల్లా కన్వీనర్ జె.నరసింహారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్,వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా నాయకులు చిన్నపంగ నరసయ్య,ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్, సిఐటియు పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.