సూర్యాపేట జిల్లా:మనుషులకు,జంతువులకు, పక్షులకు ప్రాణహాని కలిగిస్తూ పంట పొలాలకు కూడా నష్టంచేసే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వ్యర్ధాలను ఓ ట్యాంకర్ లో తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా పిల్లలమర్రి గ్రామ శివారులోని అంజనాపురి క్రాస్ రోడ్డు వద్ద మూసి ఏడుమ కాల్వలో వదులుతున్న ముఠాను శనివారం తెల్లవారు జామున సూర్యాపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం తెలిపారు.సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు,నిందితుల కథనం ప్రకారం తెల్లవారు జామున సుమారు 5 గంటల ప్రాంతంలో సూర్యాపేట రూరల్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా అంజనాపురి క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ సిబ్బందికి ఓ ట్యాంకర్ కనిపించింది.అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా ఏపీ 02TA 9414 నెంబర్ గల లారీ ట్యాంకర్ నుండి ప్లాస్టిక్ పైపు ద్వారా అందులో ఉన్న కెమికల్ వ్యర్థాలను మూసీ ఎడమ కాలువలో వదులుతున్నారు.
పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కెమికల్ వ్యర్థాలను కాలువలో వదులుతున్నట్లు చెప్పారు.దీనితో కెమికల్ ట్యాంకర్ ను,ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా ఖుత్బులాపూర్ మండలం,దిండిగల్ తండాకు చెందిన లారీ ట్యాంకర్ ఓనర్ దీపావత్ రాజు కెమికల్ వ్యర్థాలను ఎవ్వరికీ అనుమానం రాకుండా మీ ప్రాంతంలోని కాలువల్లో వదిలిరావలని,ప్రమాదకరమైన కెమికల్ వ్యర్ధాలను కాల్వలో పోసినందుకు రూ.9000 ఇస్తానని డీల్ కుదుర్చుకున్నారు.లారీ ట్యాంకర్ హెల్పర్స్ గా పని చేస్తున్న సూర్యాపేట జిల్లా,మోతె మండలం,రాఘవపురం గ్రామానికి చెందిన బోర్రాజు గణేష్ తండ్రి పిచ్చయ్య,అదే మండలం సిరికొండ గ్రామానికి చెందిన గుండ్లపల్లి వీరయ్య తండ్రి భిక్షం లు డబ్బులకు కక్కుర్తిపడి భూమికి,భూమిపై నివసించే మానవాళికి,పశుపక్ష్యాదులకు,పంటలకు కూడా తీవ్రంగా నష్టం కలిగించే అత్యంత విషపూరితమైన కెమికల్ వ్యర్థాలను ఇక్కడ కాలువలో కలపడానికి ఒప్పుకున్నారు.గత10 రోజుల క్రితం ఇదే స్థలం ప్రక్కన ఇదే కాల్వలో ట్యాంకర్ ద్వారా బోర్రాజు గణేష్,గుండ్లపల్లి వీరయ్య,అతని కొడుకు గుండ్లపల్లి అశోక్,మరియు డ్రైవరు అశోక్ లు కలసి ఓనర్ దీపావత్ రాజు మాటలు విని ప్రమాదకర కెమికల్ వ్యర్థాలను వదిలివెళ్లినట్లు చెప్పడం గమనార్హం.పోలీసులను గమనించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ట్యాంకర్ డ్రైవరు అశోక్ అక్కడి నుండి పరారయ్యాడు.ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు,లారీ ట్యాంకర్ ను,TS-29-F-3505 ఫ్యాషన్ ప్రొ మోటార్ సైకల్ ను స్వాధీనం చేసుకుని,నిందితులను రిమాండ్ కు తరలించారు.