సూర్యాపేట జిల్లా: అది జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న అతిపెద్ద నాలా.పైనుంచి వచ్చే వరద నీరు ఈ నాలా గుండానే వెళ్లాల్సి ఉంటుంది.
అటువంటి నాలాను ఓ కబ్జాదారుడు దర్జాగా కబ్జా చేశాడు.స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన విలేకరులతో అధికారులే ఆపలేదు నీకెందుకు అంటూ దురుసుసుగా ప్రవర్తించాడు.
దీనితో ఆ విలేకరులు నీకు కొంచమైనా మానవత్వం ఉందా? వర్షపు నీరు వెళ్లాల్సిన నాలాను ఇలా పూడ్చుతావా అని ప్రశ్నించడంతో మీకెందుకు మీ పని ఏందో మీరు చూసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం.గతంలో ఇదే నాలాపై కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టగా మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి నిర్మాణాలను నిలిపివేశారు.
అయినప్పటికీ మరికొందరు అత్యుత్సాహంతో మరల నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అసలే వర్షాకాలం కావడంతో వరదనీరు ఎటు వెళ్తుందో తెలియక ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదన చెందుతున్నారు.
గతంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి నాలా వెంట పర్యటించి నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అధికారులు సకాలంలో స్పందించి సదరు నాలాలపై చేస్తున్న అక్రమ కట్టడాలపై తగిన విచారణ చేసి,నిర్మాణాలు తొలగించి వరద నీరు సాఫిగా పోయేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పట్టణ ప్రజలు కోరుతున్నారు.