సూర్యాపేట జిల్లా: ప్రజా పాలన దరఖాస్తుల విషయంలో అధికారులు స్పందించాల్సిన స్థానంలో కాంగ్రెస్ నాయకులు స్పందించడం విడ్డూరంగా ఉందని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి, శాంతినగర్ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి అన్నారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, దరఖాస్తుల విషయంలో కూడా ప్రజల్లో గందరగోళం ఉందని,దరఖాస్తు ఫారం నింపడంలో అధికారులు ప్రజలకు సరైన అవగాహన కల్పించలేదని అన్నారు.
ఈ విషయమే తాను పత్రిక ముఖంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదమన్నారు.ప్రభుత్వాన్ని కానీ,పార్టీని గానీ తానెక్కడ విమర్శించలేదని,కాంగ్రెస్ నాయకులు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.
పేద ప్రజలకు, అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనేదే తమ ఉద్దేశ్యం అన్నారు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడంలో తమ పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని చెప్పారు.