సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ నాయకులు ఎవరూ మా గ్రామానికి రావద్దని వస్తే ఇదే శాస్తి జరుగుతుందని ఓ కాలనీకి వాసులు అధికార పార్టీ మంత్రి జగదీష్ రెడ్డి ప్లెక్సీలు తగులబెట్టి మాస్ వార్నింగ్ ఇచ్చిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం మక్త కొత్తగూడెంగ్రామంలోని వడ్డెర కాలనీలో జరిగింది.వివరాల్లోకి వెళితే…మక్త కొత్తగూడెం వడ్డెర కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడానికి మంత్రి జగదీష్ రెడ్డి వస్తుండగా పార్టీ నేతలు అక్కడ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కానీ,ఆ కాలనీవాసులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు.
తమకు ఈ స్థలాన్ని కాంగ్రెస్ హయాంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కేటాయించారని,ఆ స్థలంలో మీరు ఎలా కమ్యూనిటీ హాల్ కడతారని గ్రామస్తులు నిరసనకు దిగారు.
దీంతో బీఆర్ఎస్ వాళ్ళు వేరే స్థలాన్ని ఎంచుకున్నారు.అక్కడ కూడా కమ్యూనిటీ హాలు వద్దని కాలనీవాసులు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అసలు మాకు ఏ కమ్యూనిటీ హాలు అక్కర్లేదని,మీరు ఇక్కడికి రావద్దని,ఎవరు వచ్చినా వారికి తగిన శాస్తి జరుగుతుందని కాలనీ వాసులు హెచ్చరిస్తూ శంకుస్థాపనకు కట్టిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను, మంత్రి జగదీష్ రెడ్డి ఫోటోలను బీఆర్ఎస్ జండాలను అందరూ కలిసి తగలబెట్టారు.బీఆర్ఎస్ నాయకులు ఎవరు మా కాలనీకి వచ్చిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
విషయం తెలుసుకొని మంత్రి ఆ గ్రామానికి వెళ్ళకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.