నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీ( Nandikonda Municipality ) ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ లో సుమారు 30 నుండి 40 కోతుల కళేబరాలను మున్సిపల్ సిబ్బంది బుధవారం బయటికి తీసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీనితో గత కొన్ని రోజులుగా సరఫరా అవుతున్న ఈ కలుషిత నీరే తాగామని పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మున్సిపల్ అధికారులు,సిబ్బందికి ప్రజల ప్రాణాలంటే ఇంత నిర్లక్ష్యమా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ ట్యాంకు( Water tank )పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో వేసవి దాహార్తిని తీర్చుకునేందుకు లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.
కోతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడంతో ప్రజలు షాక్ గురయ్యారు.మున్సిపల్ సిబ్బంది( Municipal staff ) వాటిని బయటికి తీసే క్రమంలో చుట్టుపక్కల ఉన్న కోతులు వారిపైకి ఎగబడుతుండడంతో భయబ్రాంతులకు లోనవుతూ ఏట్టకేలకు కోతుల మృతదేహాలను బయటికి తీసి ట్యాంకును శుభ్రం చేశారు.
ఇన్ని రోజుల నుండి ప్రజలు వాడే నీటిట్యాంక్ శుభ్రం చేయాలనే ఆలోచన లేకుండా,కనీసం దానిపై మూత ఉందా లేదా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.