నల్లగొండ జిల్లా:తన పిల్లి మిస్సయ్యిందంటూ తన ఇంటి పక్కన వారే కిడ్నాప్ చేశారంటూ ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పిల్లి కేసే కదా అని స్టేషన్ అధికారులు లైట్ తీసుకున్నారేమో ఈ పంచాయితీ కాస్తా జిల్లా పోలీస్ బాస్ దగ్గరకు వెళ్లింది.
దీనితో పోలీసులకు ఈ పిల్లి కేసు ఇరిటేషన్ గా మారింది.రెండు కుటుంబాలు.
పిల్లి మాదంటే మాదని వాదిస్తున్నాయి.దీంతో పిల్లి ఎవరిదనే తేల్చే పనిలో పడ్డారు ఖాకీలు.
వివరాల్లోకి వెళితే…నల్గొండ పట్టణంలోని రేహమత్ నగర్ కు చెందిన పుష్పలత నెల రోజుల పిల్లిని తెచ్చుకుని పెంచుకుంటుంది.దానికి “పఫి” అనే పేరు పెట్టి మూడేళ్లుగా కంటికి రెప్పలా కాపడుకుంటుంది.
గతేడాది జూన్ లో పిల్లి మిస్సయ్యింది.దాంతో టూటౌన్ పీఎస్ లో మిస్సింగ్ కేసు పెట్టింది.
సీన్ కట్ చేస్తే ఆ పిల్లి అదే గల్లీలో ప్రత్యక్షమైంది.ఆశ్రఫ్ అనే వ్యక్తి తన పిల్లిని గుర్తు పట్టకుండా రంగు వేశారని పుష్పలత ఆరోపిస్తూ ఆ విషయాన్ని పోలీసులకు వివరించింది.
పోలీసులు అతనిని పిలిపించి విచారణ చేస్తే లేదు లేదు ఈ పిల్లి మాదేనని అశ్రఫ్ కుటుంబం అంటుంది.ఓ వ్యక్తి దగ్గర 3,500 రూపాయలకు కొనుక్కున్నామని చెబుతుంది.
ఈ పిల్లి గొడవ పోలీసులు సిల్లీగా తీసుకోవడంతో పంచాయితీ కాస్తా ఎస్పీ దగ్గరికి వెళ్ళింది.దాంతో బాస్ ఆదేశాల మేరకు పిల్లి హెయిర్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
ప్రస్తుతం ఘటనపై విచారణ వేగవంతంగానే జరుగుతుంది.నిజంగా పుష్పలత వాదిస్తున్నట్టు పిల్లికి రంగు పూసారా…? అశ్రఫ్ చెబుతున్నట్టు అది పుట్టుకతో ఉన్న కలరేనా.? అన్నదే ల్యాబ్ రిపోర్ట్ లో తేలనుంది.ప్రస్తుతం పిల్లి (పఫి) అశ్రఫ్ పర్యవేక్షణలోనే ఉంది.
ల్యాబ్ రిజల్ట్ లో విజయం తనదే అంటుంది పుష్పలత.అదీ చూద్దాం అస్సలు తగ్గేదేలే అంటుంది అశ్రఫ్ కుటుంబం.
చూడాలి నెగ్గేదెవరో తగ్గేదెవరో…? మొత్తానికి పిల్లి లొల్లి మాత్రం పోలీసులకు పెద్ద సవాల్ గా మారిందనే చెప్పాలి.







