సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం(Anantha Giri ) అమీనాబాద్ గ్రామంలో రహదారి పక్కనే ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్( Power transformer ) తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఒకవైపు ప్రభుత్వ పాఠశాల మరోవైపు గ్రామ పంచాయితీ ఆఫిస్ ఉండడంతో నిత్యం రద్దీగా ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఇక్కడి నుండి దీనిని మార్చాలని గత రెండు సంవత్సరాల క్రితమే విద్యుత్ శాఖకు వినతిపత్రం అందజేసినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డున వెళ్ళే వాహనదారులకు,ప్రజలకు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని మండిపడుతున్నారు.
దీనిపై స్థానిక సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు స్పందిస్తూ ప్రపోజల్ పంపినా విద్యుత్ అధికారులు స్పందించడం లేదన్నారు.ఇటుగా వెళ్లే వాహనదారులు,విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారని,ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ మార్చాలన్నారు.