సూర్యాపేట జిల్లా:జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ,మోడల్, కెజిబివి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్షణమే పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్,టై,బెల్టు, షూలు పంపిణీ చేయాలని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు పి.డి.
ఎస్.యు ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్ మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, మోడల్ స్కూల్,కెజిబివి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,యూనిఫాం పంపిణీ చేయకపోవడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయడమేనని విమర్శించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కనీస వసతులు కల్పించకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మనఊరు-మన బడి పేరుతో 7వేల కోట్లకు పైగా విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలను కార్బోరేటుకు ధీటుగా తయారు చేస్తామని చెప్పిన కేసీఆర్, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదన్నారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపలు దాటడం లేదని ఎద్దేవా చేశారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం చేసి పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవరిస్తోందని,కనీసం పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు,ప్రహరీగోడలు,తరగతి గదులు,ఫ్యాన్స్, లైట్లు,మంచినీరు వంటి సౌకర్యాలు లేకుండా వేలాది పాఠశాల ఉన్నాయన్నారు.
చివరికి 2500రూపాయలకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లని కూడా ప్రభుత్వం తొలగించిందని,దాని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు పశువుల కొట్టం కంటే దారుణంగా తయారవుతున్నాయని అన్నారు.తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో సకల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీ.డి.ఎస్.యు నాయకుల జలగం సుమంత్,చితలూరి గోపి,బట్టిపల్లి మహేష్,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.