సూర్యాపేట జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నూతనకల్ మండలం మిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆనుకొని ఉన్న చెరువు కట్ట తెగడంతో వరద నీరు పాఠశాల తరగతి గదులో నిండి రికార్డులు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు తడిసి ముద్దై దేనికి పనికి రాకుండా పోయాయి.దీనితో తిరిగి కొత్త నోటు పుస్తకాలు కొనలేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల పరిస్థితి చూసి చలించిన పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎండి సిద్ధిక్ పాషా తన సొంత ఖర్చులతో నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేసేందుకు ముందుకొచ్చారు.
శనివారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వెంకన్నలు మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు.సహాయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అండగా నిలవడం హర్షనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ అగర్వాల్,మంగు,డోర్నెస్ చిలకమ్మ,నుస్రత్ ఉన్నిసా బేగం,అరుణ,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.