నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది.పట్టణ నడి బొడ్డులో,ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తున్న మండల పరిషత్ గెస్ట్ హౌస్,పంచాయితీ రాజ్ కార్యాలయం, లైబ్రరీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని కూల్చి,అక్కడే ఇంటిగ్రేటెడ్ వ్వాపార మార్కేట్ నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్థల పరిశీలన చేయించి,మార్కెట్ నిర్మాణ పనులు ప్రారభించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యే నిర్ణయాన్ని సొంత పార్టీ ఎంపీపీతో పాటు మండల పరిషత్ సభ్యులు,మిగతా అఖిలపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.దీనిపై అఖిలపక్షం అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టగా,మండల పరిషత్ లో ఎంపీపీ ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం పాస్ చేయించారు.
అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అయినా ఎమ్మెల్యే పట్టువీడక పోవడంతో చివరికి హైకోర్టు మెట్లెక్కారు.
ప్రస్తుతం కోర్టులో ఈ వివాదం నడుస్తుంది.అయితే కోర్టు స్టే ఇచ్చిందని ఎంపీపీ చెబుతుంటే,అలాంటిదేమి లేదని ఎమ్మెల్యే వర్గం చెబుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ నెల 4వ,తేదీ అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీలతో ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేశారు.దీనిపై ఎంపిడిఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కోర్టు ఆర్డర్ కోసమని ఆ కేసును హోల్డ్ లో పెట్టారు.
ఈ తతంగం నడుస్తుండగానే గురువారం నకిరేకల్ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసి వినతి పత్రం అందజేయడం నకిరేకల్ లో రాజకీయ దుమారం రేపుతోంది.కలెక్టర్ ను కలసిన అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజలకు మరో 50 ఏళ్ల వరకు సేవలు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం కార్యలయాలను సమీకృత మార్కెట్ పేరుతో ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలి కానీ,ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించడం మంచిది కాదని హితవు పలికారు.జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి,నకిరేకల్ ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి యాతాకుల అంజయ్య,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి దైద రవిందర్, సిపిఎం జిల్లా కమిటి సభ్యురాలు కందాల ప్రమీల, వంటెపాక వెంకటేశ్వర్లు,సిపిఎం పట్టణ కార్యదర్శి, రాచకొండ వెంకన్న,మండల కార్యదర్శి యుసూఫ్, తదితరులు పాల్గొన్నారు.