నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధరణి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు.కొత్త పాస్ బుక్కులు వచ్చిన నాటి నుండి నేటి వరకు పరిష్కారంకాని సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఈ మండలంలో పని చేసిన అవినీతి అధికారుల మూలంగా ఎంతో మంది సామాన్య,పేద రైతులు నరకం చూస్తున్నారని, ఇరవై,ముప్పై ఏళ్ళ క్రితం కొనుగోలు చేసి సేద్యంలో ఉండి,రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్,పాత పట్టాదార్ పాస్ బుక్ కలిగి ఉన్నపటికీ, రెవిన్యూ అధికారుల మూలంగా ఆన్లైన్ లో మరొకరి పేరు ఉండడం,అతనికి కొత్త పాస్ బుక్కులు రావడంతో అసలు రైతులు నరకయాతన పడుతున్నారు.
ఎన్నిసార్లు ధరణిలో కావాల్సిన డాక్యుమెంట్లు పెట్టీ అప్లై చేసినా రిజెక్ట్ చేయడం తప్ప సమస్య పరిష్కారం కావట్లేదని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.
ఇదే విషయమై తహసీల్దార్ ని కలిస్తే ధరణిలో తప్పుగా ఇతర వ్యక్తుల పేరు నమోదైనప్పటికి తొలగించే అధికారం మాకు లేదని చేతులెత్తేస్తున్నారని, దీంతో అసలు రైతులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని,కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినా ఫలితం లేదని వాపోతున్నారు.ధరణి పోర్టల్ నా కొంప ముంచిందని కొప్పోల్ కు చెందిన కొత్త వెంకటేశం అంటున్నారు.నేను 1967లో మద్దోజు వెంకటాచారి దగ్గర 2 ఎకరాలు కొనుగోలు చేశాను.
1987లో దేవరకొండలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను.నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటు పాత పట్టాదార్ పాస్బుక్ మరియు కబ్జాలో నేనే ఉన్నా.ధరణిలో మాత్రం నా చెలక పక్కన ఉన్న బొమ్ము నగేష్ అనే ప్రభుత్వ టీచర్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది.
ఎన్నోసార్లు బొమ్ము నగేష్ ని నాచెలక నాకు పట్టా చేయమని అడిగాను,నేను ఎన్నిసార్లు అడిగినా రేపు చేస్తా,మాపు చేస్తానని చెబుతూ రైతుబంధు డబ్బులు కూడా ఇస్తానని చెప్పిండు.ఆఖరికి గట్టిగా అడిగితే అది నా భూమినే నేను కబ్జా పెడతానని బెదిరిస్తుండు.
దాంతో ఎమ్మార్వోని ఆశ్రయించానని తమ గోడు వెళ్లబోసుకున్నాడు.