సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం( Chivvemla ) కుడకుడ గ్రామ ఆవాస ప్రాంతంలోని సర్వే నెంబర్ 126 లో గల 90 ఎకరాల ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58,59 జీవోల పేరిట సుమారు 90 మందికి రెగ్యులరైజ్ చేస్తూ దొడ్డిదారిలో పట్టాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.పట్టాలు పొందిన వారిలో సుమారు 70 మంది బీఆర్ఎస్ క్రియాశీలక బడా నేతలేనని అప్పట్లోనే గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపించాయి.
మిగతా వారు కూడా పార్టీకి సానుకూలంగా ఉండేవారే ఉన్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇదే 126 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నిలువనీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్నేళ్లుగా పలుమార్లువామపక్షాల ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేస్తే వాటిని కూల్చివేశారు.
ఏ ఒక్క పేదవానికి ఇంటి జాగా ఇవ్వలేదు,ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవు.పైగా ఎవరైతే ఇళ్లు లేని పేదలు గుడిసెలు వేశారో వారిపై దాడులు,దౌర్జన్యాలు చేస్తూ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.
గత పాలకులు అధికారాన్ని అడ్డంపెట్టుకుని పేదలకు చెందాల్సిన కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆనాటి అధికార పార్టీకి చెందిన నాయకులకు,అనుచరులకు పట్టాలు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చాక గతంలో అక్రమమార్గంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన విషయంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
అందుకే అధికారులు సర్వే నెంబర్ 126 భూముల వ్యవహారంపై విచారణ షురూ చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు.ఇదే విషయమై సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ రావును వివరణ కోరగా…126 సర్వే నెంబర్ పై సమగ్ర విచారణ జరుపుతున్నామని,గురువారం రోజే విచారణ మొదలు పెట్టామన్నారు.సూర్యాపేట,చివ్వెంల,పెన్ పహాడ్,ఆత్మకూర్ (ఎస్) కు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం, సర్వేయర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారని,రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తవుతుందని,విచారణ పూర్తి కాగానే జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేస్తామన్నారు.58,59 జీవోలు ఉద్దేశ్యం ఏమిటంటే 2020 జూన్ 2 నాటికి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అందులో ఇంటి నిర్మాణం చేపట్టి ఉంటే గ్రామమైతే గ్రామపంచాయతీ నుండి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ నుంచి నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని,ఇంటికి సంబంధించిన నాలా కలెక్షన్, ఇంటి పన్ను రసీదులు సరిచూసుకొని 58,59 జీవోల కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.