నల్లగొండ జిల్లా:భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 20,21వ, తేదీల్లో బూత్ స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన శుక్రవారం తెలిపారు.ఓటరు జాబితా సవరణ,చేర్పులు,మార్పులపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.18 సంవత్సరాల వయస్సు నిండిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని,ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.భారతీయ పాస్పోర్టు కలిగి విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఓటరుగా నమోదుకోసం 6–ఏ ఫారంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఓటరు జాబితాలో ప్రస్తుతం ఉన్న పేరు తొలగింపు, అభ్యంతరాలు తెలిపేందుకు ఫారం–7ను సమర్పించాలన్నారు.ఓటును ఓ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి మార్చుకునేందుకు,ఫొటో గుర్తింపు కార్డు మార్పు, పీడబ్ల్యూడీ గుర్తింపు కోసం ఫారం–8ను సమర్పించాలన్నారు.
ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.