సూర్యాపేట జిల్లా: ఓ కుటుంబంలో భూమి వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసి, చివరికి దాడికి పాల్పడిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.
సూర్యాపేట రూరల్ మండలం కాసరబాద గ్రామానికి చెందిన కొండా సాయిలు,లింగమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.వారిలో ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.
కాగా తండ్రి సాయిలు తనకున్న ఆస్తిని ఏకైక కుమారుడైన కొండా నాగయ్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలకు సమాన వాటా ఇచ్చాడు.ఆడపిల్లలకు ఇచ్చిన భూమిని తల్లిదండ్రులు ఇటీవల వారికి కూడా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఆడపిల్లలకు తనతో పాటు సమాన వాటా ఇవ్వడం ఇష్టంలేని కుమారుడు నాగయ్య గత కొంత కాలంగా తల్లిదండ్రులు మరియు ఆడపిల్లలతో వాగ్వాదానికి దిగుతున్నాడు.ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున తండ్రి ఇచ్చిన భూమిని చూడటానికి ఆడపిల్లలు తమ పిల్లలతో వెళ్లారు.
ఆ సమయంలో సోదరుడు నాగయ్య అక్కడికి చేరుకొని మీరు మీ పెళ్ళి జరిగేటప్పుడు లక్షల్లో కట్నం తీసుకెళ్లారు, ఇప్పుడు మళ్లీ నా ఆస్తిలో సగ భాగం ఎలా పొందుతారని చెల్లెళ్ళను ప్రశ్నిస్తూ,
తన ఆస్తిని అక్రమంగా లాక్కున్నారని వారితో వాగ్వాదానికి దిగాడు.దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి అది కాస్త ఘర్షణకు దారితీసింది.
మేనమామ తమ తల్లులతో గొడవ పడుతుండగా అక్కడే ఉన్న వారి కోడుకులు మేనమామ నాగయ్యపై కర్రలతో దాడికి దిగడంతో ఇరువురి మధ్య పరస్పర దాడి జరిగింది.ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని హుటాహుటిన సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో వారంతా చికిత్స పొందుతున్నారు.