సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎలాంటి అనుమతులు లేని ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న పది రోజుల్లో అన్ని ఆసుపత్రులను ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సరైన పత్రాలు,ఆస్పత్రికి సంబంధించి పూర్తి వివరాలు తనిఖీ బృందాలకు ఇవ్వాలని కోరారు.వైద్య సేవలలో నాణ్యత కొరకు, రోగులకు కల్పించాల్సిన పూర్తిస్థాయి సేవలు, ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలు,రిజిస్ట్రేషన్ వివరాలు,ఉండాల్సిన సర్టిఫికెట్లు పరిశీలిస్తారన్నారు.
అందులో భాగంగా శనివారం హుజూర్ నగర్ లో తనిఖీలు నిర్వహించి,ఆసుపత్రిలో వైద్యుడు లేకుండా రోగులను పరీక్షిస్తున్న ఆక్సిజన్ హాస్పిటల్ ను సీజ్ చేశామన్నారు.అనుమతులు లేని ముందుల షాపుల నిర్వహణ,రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకపోవడం, రికార్డులు లేకపోవడం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్యగౌడ్,జిల్లా మేనేజర్ భాస్కర్ రాజు,మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్,ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్,ఇందిరాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.