కల్తీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ సూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లా:జిల్లాలో కల్తీ మద్యం దందా విచ్చలవిడిగా జరుగుతుంది.మద్యం వ్యాపారులు మొత్తం సిండికేట్ గా మారి,జిల్లాలోని ఎక్సైజ్ అధికారుల అండదండలతో యథేచ్ఛగా బెల్టుషాపులు నడుపుతూ,ఎమ్మార్పీ మీద 40 నుండి 60 రూపాయల వరకు అదనంగా విక్రయిస్తూ అడ్డగోలుగా ప్రజలను దోపిడీ చేస్తున్నారు.

 Address Of Carafe For Adulterated Liquor Is Suryapet District-TeluguStop.com

ఈ దోపిడీ సరిపోక ఇప్పుడు సరికొత్త దందాకు తెరలేపారు.వైన్స్ లో ఖరీదైన మద్యం బాటిళ్లు నుండి మద్యాన్ని తీసి అందులో స్పిరిట్,వాటర్ కలుపుతూ వైన్స్ లలో,బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అందుకే కల్తీ మద్యం పట్టుబడిన విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత పడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జిల్లాలో జరిగే కల్తీ మద్యంపై రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తుంటే జిల్లా ఎక్సైజ్ అధికారులకు తెలియకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది.జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు కల్తీ మద్యం ఘటనలు వెలుగు చూడడంతో మద్యం ప్రియులు కల్తీపై ఆందోళన చెందుతున్నారు.

మూడు రోజుల క్రితం అనంతగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి వైన్స్ లో, పాలకవీడు మండలం జాన్ పహాడ్ జేపీఎస్ వైన్స్ లో కల్తీ మద్యం పట్టుబడడం కలకలం రేపుతోంది.అనంతగిరి,జాన్ పహాడ్ లోనూ ఎక్సైజ్ స్పెషల్ టీం దాడులు జరపడం గమనార్హం.

తాజాగా సోమవారం జాన్ పహాడ్ జేపీఎస్ వైన్ షాప్ లో మద్యం కల్తీ జరుగుతుందన్న సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాడి చేసి కల్తీ మద్యంతో పాటు,ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొని,స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం.ఈ విషయంపై హుజూర్ నగర్ ఎక్సైజ్ సిఐని ఫోన్లో వివరణ కోరగా నాకు తెలియదు,సెలవుల్లో ఉన్నాను,ఎస్ఐని అడగండని పొంతలేని సమాధానం చెబుతూ హైకోర్టులో ఉన్నానని ఫోన్ కట్ చేశారు.

ఎస్ఐకి ఫోన్ చేసి వివరణ కోరగా సీఐని అడగండి అంటూనే స్టేషన్ కి రమ్మని చెప్పి స్టేషన్ లో లేకపోవడం,ఫోన్ చేస్తే స్పందించని పరిస్థితి.అక్రమ కల్తీ మద్యం దందాలో అధికారుల తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా జిల్లాలోని పలు వైన్స్ లలో మద్యం బాటిల్స్ మూతలు ఓపెన్ చేసే ఉంటున్నాయని,ఇదేంటని ప్రశ్నిస్తే పైనుంచి అలాగే వస్తుందని దబాయిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని మందుబాబులు వాపోతున్నారు.జిల్లాలో కల్తీ మద్యం దందాపై రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందుతున్నప్పుడు జిల్లా అధికారులకు తెలియదా అనే ప్రశ్న తలెత్తుంది.

టాస్క్ఫోర్స్ టీమ్ దాడుల్లో పట్టుబడ్డ కల్తీ మద్యం గురించి కనీసం ప్రెస్ మీట్స్ పెట్టకపోవడం చూస్తుంటే కల్తీగాళ్లను కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు బిజీగా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు మద్యం కల్తీ దందాపై సీరియస్ గా దృష్టి సారించి,మద్యం దందాకు అడ్డుకట్ట వేయాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube