ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నకు ఆది నుంచి కష్టాలే.అకాల వర్షాలు,ఎరువుల కొరత అనేక సమస్యలను ఎదుర్కొని పంట పండించడం ఒక ఎత్తు అయితే,వాటిని విక్రయించడం మరో సవాలుగా మారింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో లారీలు రాక ధాన్యం సరఫరా కాక కొనుగోళ్లు నిలిచిపోయి రైతన్నలు అరి గోసపడుతున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి చూపించిన ఉత్సాహం, వరి ధాన్యం కొనుగోలు చేసి,రైస్ మిల్లులకు తరలించడంలో చూపించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తరలించడానికి లారీల( Lorries ) కొరత తీవ్రంగా ఉండడంతో తరుగు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధాన్యం తరలించడానికి లారీలు రాకపోవడంతో కొనుగోలు ప్రక్రియను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిలిపివేశారని,ఇంత జరుగుతున్నా ధాన్యం తరలించడానికి టెండర్ దక్కించుకున్న ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యం ఎవరిదైనా ఫలితం మాత్రం రైతులం అనుభవిస్తూ, కుటుంబ సమేతంగా కొన్ని రోజులుగా తిండి,నిద్రలేక కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నామని అంటున్నారు.రైతులు వరి నాట్లు వేసినప్పటి నుండి రకరకాల తెగుళ్ల బారి నుండి కాపాడుకోవడానికి నానా రకాల ఎరువులు వాడి పంటలను కాపాడుకున్నామని,వరి పంట కోత దశకు వచ్చిన తరుణంలో అకాల వడగండ్ల వర్షంతో సగానికి పైగా దిగుబడి తగ్గగా, మిగిలిన ధాన్యన్ని కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు సక్రమంగా లేక సతమతమవుతున్నారని,ఒక బస్తాకు 44 కిలోల తూకం వేస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని,మిల్లర్లు రోజుల తరబడి ధాన్యాన్ని లారీల్లోనే నిలిపి వేస్తున్నా మిల్లర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, మండలం వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం,ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యన్ని కొనుగోలు చేస్తున్నా ధాన్యన్ని తరలించడం కోసం రైతులు జిల్లా కేంద్రాలలో రోడ్ల వెంబడి పడిగాపులు కాస్తున్నా ఒక్క లారీ కుడా దొరకడం లేదని వాపోతున్నారు.ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ,ట్రాన్స్ పోర్ట్ అధికారులు నిర్లక్ష్యం వీడి నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
లారీల కొరతపై అధికారులు దృష్టిసారించి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యపు నిల్వలను రైస్ మిల్లులకు చేరవేసి, కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతులను కాపాడాలని కోరుతున్నారు.







