సూర్యాపేట జిల్లా:హింస లేని సమాజ స్థాపన కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఇద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.నవంబర్ 25 న జరిగే హింస వ్యతిరేక దినోత్సవం నుండి డిసెంబర్ 10 న జరిగే మానవ హక్కుల దినోత్సవం వరకు ఐద్వా ఆధ్వర్యంలో జరుగుతున్న సెమినార్లలో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో గల సాక్షిశ్రీ జూనియర్ కళాశాలలో మహిళలపై జరుగుతున్న హింస అరికట్టాలనే అంశంపై ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఏలుగూరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సెమినార్ కు ఆమె ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు,పురుషులతో సమానంగా చదువుతూ, అన్ని రంగాల్లో పనిచేస్తూ ముందుకు పోతున్నా ఇంకా వివక్ష కొనసాగడం దుర్మార్గమన్నారు.
స్త్రీలు సామాజికంగా,ఆర్ధికంగా, రాజకీయంగా హింస ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.నూటికి 40 శాతం మంది స్త్రీలు గృహ హింసను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు తెలుపుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రతి సంవత్సరం హింస వ్యతిరేక దినోత్సవాన్ని స్త్రీల హక్కుల పరిరక్షణ దినంగా పాటించాలని డిమాండ్ చేశారు.మహిళలు,చిన్నపిల్లలపై దాడులు,హత్యలు, అత్యాచారాలతో కూడిన హింస పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
కర్ణాటక,బీహార్,అస్సాం,తెలంగాణ, మిజోరాం,నాగాలాండ్ రాష్ట్రాల్లో గృహహింస రోజు రోజుకు పెచ్చరిల్లి పోతుందన్నారు.హింస లేని సమాజాన్ని తీసుకురావడం కోసం ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలో సరైన విధానాలను పొందుపరచాలని సూచించారు.
ప్రభుత్వ విధానాల్లో,పురుషుల ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే మహిళలకు హింసలేని సమాజాన్ని స్థాపించడానికి అవకాశం ఉందన్నారు.విద్యలో,క్రీడల్లో,సైన్స్ రంగంలో మహిళలు ముందుకు పోతున్నప్పటికీ ఇంకా ఒదిగి ఉండాలనే పితృస్వామ్య భావజాలాన్ని కొనసాగించడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు.
ఆధునిక యుగంలో మహిళలు పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి మహిళల హక్కులు,చట్టాలు కాపాడుకోవాలని,హింసలేని సమాజ స్థాపనకు పాటుపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,ఐద్వా సంఘం సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.